Bookings Open: రూపాయి ఖర్చు లేకుండా.. ఏసీ కల్యాణ మండపంలో వివాహం

ABN , First Publish Date - 2021-07-26T16:23:32+05:30 IST

సత్యదేవుని సమక్షంలో..

Bookings Open: రూపాయి ఖర్చు లేకుండా.. ఏసీ కల్యాణ మండపంలో వివాహం

పేదల పెళ్లికి పెద్ద వేదిక

అందమైన మండపం, రెండు గదులు, కుర్చీలు, సామగ్రీ ఉచితమే 

బుకింగ్స్‌ ప్రారంభించిన అన్నవరం దేవస్థానం అధికారులు 


అన్నవరం: సత్యదేవుని సమక్షంలో..సువిశాల ఏసీ కల్యాణ మండపంలో..అందమైన వివాహ వేదికపై ఒక్కటవ్వాలనుకునే జంటలకు రత్నగిరి ఆహ్వానం పలుకుతోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సర్వ హంగుల మధ్య వివాహం జరిపించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. లలిత రైస్‌ ఇండస్ట్రీస్‌ అధినేతలలో ఒకరైన మట్టే శ్రీనివాస్‌ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ ఎయిర్‌ కండీషన్డ్‌ ఏర్పాటుతో నిర్మించిన సత్య శ్రీనివాస ఉచిత ఏసీ కల్యాణ మండపం పేదల పెళ్లికి పెద్ద వేదికగా నిలుస్తుంది.. ప్రస్తుతం అన్నవరం దేవస్థానం అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు.. 


అన్నవరం ఒకేసారి 12 వివాహాలు 

ఈ ఏసీ కల్యాణ మండపంలో ఒకేసారి 12 వివాహాలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అందమైన మండపాలను కొలువుదీర్చారు. ఈ మండపంలో పెండ్లి కుమారుడు, పెండ్లికుమార్తెకు కలిపి రెండు గదులు కేటాయిస్తారు.. పెండ్లి పీటలు, వివాహానికి అవసరమయ్యే పాత్రలు, పాదుకలు, కాడె, జంఖానా, కుర్చీలను కూడా  దాత మట్టే శ్రీనివాస్‌ సమకూర్చారు. పేదల పెళ్లి సాదాసీదాగా కాకుండా  ఉన్నతంగా జరగాలనే ఆశయంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్‌ చెబుతున్నారు. అధునాతన ఈ  కల్యాణ వేదికను ఈ నెల 16న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా.. వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్‌ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్‌ చేస్తారు.. 


బుకింగ్‌ ఇలా..

ఏసీ కల్యాణ మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్నపత్రిక, వధూవరుల ఆధార్‌ జెరాక్స్‌, వారి తల్లిదండ్రుల ఆధార్‌ జెరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలో అందజేయాలి. వారికి ఉచిత కల్యాణ వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కల్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామగ్రిని పొందాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని ఆలయ వర్గాలు వెల్లడించారు.  



Updated Date - 2021-07-26T16:23:32+05:30 IST