వేడుకగా భాష్యకారుల సాత్తుమొర

ABN , First Publish Date - 2021-04-19T06:53:43+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకారుల సాత్తుమొర వేడుకగా జరిగింది.

వేడుకగా భాష్యకారుల సాత్తుమొర
శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతున్న భాష్యకారులు, స్వామి, అమ్మవార్లు

తిరుమల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకారుల సాత్తుమొర వేడుకగా జరిగింది. ఈనెల తొమ్మిదో తేదీన ప్రారంభమైన భాష్యకారుల ఉత్సవాలు 27వ తేదీవరకు జరగనున్నాయి. శ్రీరామానుజులవారు జన్మించిన ఆరుద్ర నక్షతాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది భాష్యకారుల సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ‘శ్రీభాష్యం’ పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు వైభవోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, భాష్యకార్లకు విశేష సమర్పణ గావించారు. శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఓ తిరుచ్చిపై, మరోతిరుచ్చిపై భాష్యకార్లవారిని వేంచేపు చేసి సహస్రదీపాలంకార సేవ తర్వాత మాడవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరాణాలతో సల్లింపు చేశారు. 

Updated Date - 2021-04-19T06:53:43+05:30 IST