రేషన్ షాపుల వద్ద షరామామూలే
ABN , First Publish Date - 2021-07-25T05:44:10+05:30 IST
కరోనా విపత్కర పరిస్థితుల్లో తెల్లరేషన్ కార్డుదారులు గంటల తరబడి గుంపులుగుంపులుగా రేషన్ షాపుల వద్ద ఉచిత బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సర్వర్ రాకపోవడంతో కార్డుదారులు ఆందోళన
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 24: కరోనా విపత్కర పరిస్థితుల్లో తెల్లరేషన్ కార్డుదారులు గంటల తరబడి గుంపులుగుంపులుగా రేషన్ షాపుల వద్ద ఉచిత బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియాన్ని గత ఐదురోజుల క్రితం రేషన్షాపుల వద్ద ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 10లక్షల రేషన్కార్డుదారులు ఉండగా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున పంపిణీని చేపట్టారు. అయితే సాధారణంగా సర్వర్ పనిచేస్తే ఐదారు రోజుల్లోనే సుమారు 80శాతం పంపిణీ జరగాల్సి ఉంది. సర్వర్ పూర్తిస్థాయిలో డౌన్ కావడంతో రోజుకు సరాసరిన 10శాతం మందికి కూడా బియ్యం అందుతున్న పరిస్థితి లేకుండాపోయింది. ఆయా రేషన్షాపుల వద్ద కార్డుదారులు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. డీలర్లు కార్డుదారుడి నెంబరు నమోదు చేసి వేలిముద్ర వేయించుకునే సమయంలో సర్వర్ పోతుండడంతో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవాలని డీలర్లు, కార్డుదారులు కోరుతున్నారు.