సర్వాంగ సుందరం.. ముక్కంటి క్షేత్రం

ABN , First Publish Date - 2021-03-04T07:40:28+05:30 IST

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

సర్వాంగ సుందరం.. ముక్కంటి క్షేత్రం
ఆలయంలోపల, స్తంభాలకు విద్యుద్దీపాలంకరణ, మహాద్వారం వద్ద భక్తుల కోసం చలువ పందిళ్లు

శ్రీకాళహస్తి, మార్చి 3: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈనెల 6 నుంచి 19వతేదీ వరకు జరిగే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయాధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయం లోపల రంగురంగుల ముగ్గులు వేయడం భక్తులను ఆకట్టుకుంటోంది. స్వామి, అమ్మవార్ల సేవలకు వినియోగించే వాహనాలకు ముచ్చటైన రంగులు వేశారు. ఆలయం లోపలికి భక్తులు ప్రవేశించే నాలుగు మార్గాల్లో ఉన్న గోపురాలకు సున్నం వేశారు. ఇక ఆలయం పైభాగంలోనూ, స్తంభాలకు విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. ఉత్సవాల్లో రోజూ విభిన్నరకాల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలయప్రాంతంలో ధూర్జటి కళా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. 


ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.24కోట్లు

శ్రీకాళహస్తీశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ.1.24 కోట్లు వచ్చినట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. బుధవారం ఆలయ ప్రధాన హుండీ, పరివార దేవతల వద్ద ఉన్న హుండీల లెక్కింపు జరిగింది. ఇందులో నగదుతోపాటు 96.5 గ్రాముల బంగారం, 534.4 కిలోల వెండి, 19 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. గోశాల ట్రస్టుకు రూ.1,18,722 విరాళం అందింది. ఈ ఆదాయం 28 రోజుల వ్యవధిలో వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-04T07:40:28+05:30 IST