సర్కార్పై సర్పంచ్లు తిరగబడాలి: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-12-16T23:27:57+05:30 IST
స్థానిక సంస్థలను, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న సీఎం కేసీఆర్ సర్కార్పై రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లంతా
నార్కట్పల్లి: స్థానిక సంస్థలను, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న సీఎం కేసీఆర్ సర్కార్పై రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లంతా తిరగబడాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే చూశామని, సర్కార్ తీరుతో సర్పంచ్ల ఆత్మహత్యలను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని గప్పాలు పలికిన ముఖ్యమంత్రి తన అస్తవ్యస్త విధానాలతో శ్మశాన తెలంగాణగా మార్చాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీల కరెంటు వాడకం బిల్లులను ప్రభుత్వమే భరించిందని కోమటిరెడ్డి చెప్పారు. నిధులు ఇవ్వకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా ఉండలేమంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి రాజీనామా చేశారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.