ఏసీబీ వలలో సర్పంచ్?
ABN , First Publish Date - 2021-03-06T01:29:51+05:30 IST
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ గ్రామ సర్పంచ్ చిక్కినట్లు
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ సర్పంచ్ చిక్కినట్లు తెలుస్తోంది. ఏసీబీకి ప్రజాప్రతినిధి చిక్కిన సంఘటన జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాలోని పూడూరు మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ వ్యవహారం ఆ ఊరిలో హాట్ టాపిక్గా మారింది. ఆ గ్రామంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ చేశారు.
అయితే ఆ వెంచర్ అనుమతి కోసం రూ.20 లక్షలను లంచంగా ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులను సర్పంచ్ డిమాండ్ చేశాడు. అయితే ఏసీబీ అధికారులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే కలిసి లంచం విషయాన్ని వివరించారు. వ్యాపారుల వద్ద నుంచి సర్పంచ్ రూ.13 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా సర్పంచ్ను పట్టుకున్నారు. హైదరాబాద్ అప్పా జంక్షన్ దగ్గర ఉన్న రాజేంద్రనగర్ షాదాన్ కళాశాల దగ్గర లంచం డబ్బులు తీసుకుంటుండగా సర్పంచ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.