ప్రజారోగ్యానికి సర్కార్ పెద్దపీట
ABN , First Publish Date - 2020-05-30T10:51:38+05:30 IST
ప్రజార్యోగానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులను సీఎం జగన్
విజయనగరం (ఆంద్రజ్యోతి) మే 29 : ప్రజార్యోగానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ తీసుకొచ్చారని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ‘మన పాలన - మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం వైద్యం, స్త్రీ శిశు సంక్షేమంపై చర్చించారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శాఖ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆమెతో పాటు కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు తదితరులు సందర్శించారు. జిల్లాలో కరోనా వ్యాపించకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై డీఎంఅండ్హెచ్వో రమణ కుమారి , డీసీహెచ్సీ నాగభూషణం వివరించారు. అనంతరం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్లో వారంతా పాల్గొన్నారు.
ఆదాయ పరిమితిని రూ.5లక్షలకు పెంచగా, నవంబరు నుంచి 32 వేల వ్యాధులకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందిం చనున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రహస్థులకు ఇచ్చే పింఛన్ రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచినట్లు చెప్పారు. జూలై నుంచి 1060 నూతన 104, 108 వాహనాలు ప్రారంభం కానున్నాయన్నారు. ఐటీడీఏ పరిధిలో ఏడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మంజూ రుపై సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ... జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనిచేసే చోట అధికారులు, వైద్యులు నివాసం ఉండాలన్నారు. డాక్టర్ చిట్టి రమణారావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు జిల్లా కేంద్రంలో అమలవుతున్నాయని తెలిపారు.