అమెరికాలో భారత సంతతి మహిళకు కీలక పదవి
ABN , First Publish Date - 2020-02-22T01:22:27+05:30 IST
అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కనుంది.
న్యూయార్క్: అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నామినేట్ చేస్తున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఆమె యూఎస్ అటార్నీ ఆఫీస్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జనరల్ క్రైమ్స్ డిప్యూటీ చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పూర్తి చేసిన సరితా కోమటిరెడ్డి.. హార్వర్డ్ లా స్కూల్ నుంచి జ్యూరిస్ డాక్టర్ పట్టా పొందారు. అనంతరం వివిధ స్కూల్లలో విద్యార్థులకు న్యాయ శాస్త్ర పాఠాలు బోధించారు. అలాగే కెలాగ్ హన్సెన్ టాడ్ ఫిజెట్ అండ్ ఫ్రెడెరిక్ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు చేశారు. కొంతకాలం బీపీ డీప్వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్షోర్ డ్రిల్లింగ్ జాతీయ కమిషన్ తరఫున లాయర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల సరితా కోమటిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.