Tragedy: సరబ్జిత్ సింగ్ భార్య సుఖ్ప్రీత్ కౌర్ రోడ్డు ప్రమాదంలో మృతి
ABN , First Publish Date - 2022-09-13T21:43:24+05:30 IST
పాకిస్థాన్లోని లాహోర్ జైలులో తోటి ఖైదులు దాడి చేయడంతో 2013లో దుర్మరణం పాలైన పంజాబ్ వాసి ..
జలంధర్: పాకిస్థాన్లోని లాహోర్ జైలులో తోటి ఖైదులు దాడి చేయడంతో 2013లో దుర్మరణం పాలైన పంజాబ్ వాసి సరబ్జిత్ సింగ్ (Sarabjit singh) కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. సరబ్జిత్ సింగ్ భార్య సుఖ్ప్రీత్ కౌర్ (Sukhpreet kaur) రోడ్డు ప్రమాదంలో (road accindent) మరణించారు. ఈనెల 11వ తేదీన జలంధర్ వెళ్తుండగా స్కూటర్ పైనుండి కింద పడి ఆమె కన్నుమూసినట్టు కౌర్ కుమార్తె స్వపన్దీప్ కౌర్ తెలిపారు. భిఖివిండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే సుఖ్ప్రీత్ కౌర్ను ఆసుపత్రిలో చేర్చినప్పటికీ గాయాల కారణంగా సోమవారం (సెప్టెంబర్ 12) ఆమె కన్నుమూసింది. ఆమె స్వగ్రామమైన తర్న్ తరన్లో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి.
నాటి విషాదం...
సరబ్ జిత్ సింగ్ (49) పంజాబ్లోని భిఖ్విండ్ టౌన్లో వ్యవసాయదారు. ఇండో-పాక్ సరిహద్దుల్లో నివసించేవాడు. మద్యం మత్తులో ఆయన పొరపాటున సరిహద్దులు దాటడంతో అతన్ని పాక్ సరిహద్దు సిబ్బంది పట్టుకుంది. అయితే 1991లో ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పువచ్చింది. లాహోర్లోని కోట్ లఖ్పట్ జైలులో 22 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆయనపై 2013లో జైలులోనే తోటి ఖైదీలు దాడి చేశారు. తలపై తీవ్రగాయాలు కావడంతో ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో కోమాలో ఉండి ఆయన తుదిశ్వాస విడిచాడు.
ఇరవై రెండేళ్ల జైలు శిక్షా కాలంలో సరబ్జిత్ సింగ్ విడుదల కోసం ఆయన సోదరి దల్బీర్ కౌర్ పోరాటం సాగించారు. వివిధ వేదికలపై తన గోడు వెళ్లబోసుకున్నారు. తన తమ్ముడు అమాయకుడని, పొరపాటున ఆయన పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి అరెస్టయ్యాయని ఆమె బలంగా తన వాదన వినిపించడంతో పాటు తన సోదరుడిని చూసేందుకు పాకిస్తాన్ కూడా వెళ్లింది. సింగ్ మరణంపై దర్యాప్తు జరపాలని భారత విదేశాంగ శాఖ సైతం పాకిస్థన్ ప్రభుత్వాన్ని కోరింది. దల్బీర్ కౌర్ కూడా ఇదే డిమాండ్ చేశారు. ''పాక్ ప్రభుత్వమే వ్యూహం ప్రకారం అతనిపై దాడి చేయించి చంపించినట్లయితే దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదు. అధికారులకు తెలియకుండా దాడి జరిగి ఉంటే మాత్రం తప్పనిసరిగా దానిపై దర్యాప్తు జరిపించాలి'' అని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. కాగా, గత జూన్లోనే దల్బీర్ కౌర్ ఛాతీనొప్పితో కన్నుమూశారు.