సంస్కృతంతో సాంస్కృతిక సంబంధాలు బలోపేతం : మోదీ
ABN , First Publish Date - 2021-08-29T20:05:50+05:30 IST
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి
న్యూఢిల్లీ : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఇండోర్ను దేశంలో మొట్టమొదటి ‘వాటర్ ప్లస్’ సిటీగా నిలిపిన ఆ నగర ప్రజలను ప్రశంసించారు. సాంస్కృతిక సంబంధాలు బలోపేతమవడంలో సంస్కృతం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆదివారం ఆయన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మాట్లాడారు.
‘మన్ కీ బాత్’ కేవలం భారత దేశానికే పరిమితం కాలేదని, అంతర్జాతీయ స్థాయికి చేరిందని, విదేశాల్లోని భారతీయులు కూడా తనకు సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన ప్రతిసారీ ఆటోమేటిక్గా ఇండోర్ గుర్తుకొస్తుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఇండోర్ ఉందని తెలిపారు. అయితే ఇండోర్ ప్రజలు సంతృప్తి చెందలేదని, దేశంలో తొలి వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్ను నిలిపారని అన్నారు.
ఒలింపిక్స్లో మన దేశానికి పెద్ద సంఖ్యలో పతకాలు రాకపోయి ఉండవచ్చునని, నేటి యువత క్రీడలకు సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. ఈ వేగాన్ని ఆపలేమని చెప్పారు. ఈ వేగం అన్ని రంగాల్లోనూ శాశ్వతంగా ఉండేలా కృషి చేయాలన్నారు. నేటి యువత రొటీన్ను అనుసరించాలని అనుకోవడం లేదని చెప్పారు. తెలియని చోట్లకు వెళ్లాలని కోరుకుంటున్నారని, అక్కడ ఒకసారి నిలదొక్కుకుంటే, ఇక ఆపడం ఎవరి తరమూ కాదని చెప్పారు.