ప్రజల కోసం సంజీవని ఆరోగ్యరథం
ABN , First Publish Date - 2022-08-11T09:06:31+05:30 IST
ప్రజల కోసం సంజీవని ఆరోగ్యరథం
చేనేత వస్త్రాల మార్కెటింగ్కు టాటాతో ఒప్పందం: లోకేశ్
దుగ్గిరాల, మంగ ళగిరి, ఆగస్టు 10: నిరుపేదలకు వైద్యం అందించి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం మెరు గుపరచడమే లక్ష్యంగా ఆరోగ్యసంజీవని రథం ప్రారంభిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. దుగ్గిరాలలో ఆయన బుధవారం జెండా ఊపి ఆరోగ్య సంజీవి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడాది కాలంలో 50వేల కుటుంబాలకు మందులు, వైద్యసేవలు ఉచితంగా అందిస్తామన్నారు. ప్రపంచవ్యాపితంగా మంగళగిరి చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు టాటా సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నామన్నారు.
మంగళగిరిలోనే పోటీ చేస్తా..
కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం ఎంత అనివార్యమో మంగళగిరిలో తాను పోటీ చేయడం కూడ అంతే అనివార్యమని లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను మంగళగిరి బరినుంచి తప్పుకుంటానంటూ వస్తున్న ప్రచారాలను ఖండించారు. చంద్రబాబు సర్వేలో లోకేశ్కు ప్రజాదరణ లేదంటే ఆయన తనను మార్చివేస్తారన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మూడేళ్ల మూడు మాసాలుగా నియోజకవర్గంలో ప్రభుత్వం చేయాల్సిన ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సొంతంగా చేస్తున్నట్లు తెలిపారు.