యూట్యూబ్‌ చూసి శానిటైజర్‌ కంపెనీ!

ABN , First Publish Date - 2020-08-10T10:04:34+05:30 IST

ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసు కొలిక్కి వచ్చింది. దీంతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో పర్ఫెక్ట్‌ శానిటైజర్‌

యూట్యూబ్‌ చూసి శానిటైజర్‌ కంపెనీ!

  • పోలీసుల అదుపులో ‘పర్ఫెక్ట్‌’ యజమాని సహా ఐదుగురు
  • కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసు కొలిక్కి


కురిచేడు, ఆగస్టు 9: ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసు కొలిక్కి వచ్చింది. దీంతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో పర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌, ముడి సరుకు అందజేసిన ఇద్దరు మార్వాడీలు, హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న మరో ఇద్దరు ఉన్నారు. వారిని హైదరాబాద్‌ నుంచి ఆదివారం తెల్లవారు జామున కురిచేడుకు తీసుకువచ్చారు. ఒకట్రెండ్రోజుల్లో కోర్టులో హాజరుపరిచే అవకాశముది. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ఫర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ మూడో తరగతి మాత్రమే చదివాడు. ప్రారంభంలో ఓ కిరాణా షాపులో పనిచేశాడు. తరువాత పర్ఫెక్ట్‌ కిరాణా మర్చంట్స్‌ పేరుతో గృహావసరాలకు ఉపయోగపడే దుకాణాన్ని నడిపాడు. లాక్‌డౌన్‌ సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు అమ్మకాలు చేశాడు. వ్యాపారం బాగుండడంతో యూట్యూబ్‌లో చూసి ఆ విధానంలో శానిటైజర్‌ తయారు చేయడం ప్రారంభించాడు. శానిటైజర్‌ తయారు చేయడానికి ల్యాబ్‌ టెక్నీషియన్లు కానీ, అనుమతులు కానీ ఏమీ లేవు. శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను వినియోగించడమే శ్రీనివాస్‌ చేసిన పెద్ద తప్పు. 16 మంది మృత్యువాత పడటానికి అదే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కురిచేడులో కొంతమంది మెడికల్‌ షాపుల వారు మాత్రమే సదరు శానిటైజర్లు అమ్మినట్లు పోలీసుల వద్ద రికార్డులు ఉన్నాయి. హైదరాబాద్‌లో తయారయిన పర్ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ను దర్శికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటరు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని మెడికల్‌ షాపులకు అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టారు. 

Updated Date - 2020-08-10T10:04:34+05:30 IST