పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ
ABN , First Publish Date - 2020-06-06T10:02:41+05:30 IST
పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియని, రోజూ చెత్త సేకరణ జరుగుతూనే ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
అభివృద్ధిలో ఎద్దుమైలారం ఆదర్శంగా నిలవాలి
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమే్షకుమార్
సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం, గుంతపల్లిలో పర్యటన
కంది, జూన్ 5 : పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియని, రోజూ చెత్త సేకరణ జరుగుతూనే ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్షకుమార్ అన్నారు. మూడో విడత పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం కంది మండలంలోని ఎద్దుమైలారంలో సోమే్షకుమార్ పర్యటించారు. ఎద్దుమైలారంలోని అన్ని వీధుల్లో ఆయన కలియతిరిగారు. గ్రామంలోని డంపుయార్డు, వర్మికంపోస్ట్ యూనిట్, హరితహారం మొక్కలను వైకుంఠధామాలను ఆయన పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, సీసీ కెమెరాలు, మైకుల ద్వారా సందేశాలివ్వడం బాగున్నాయని సర్పంచ్ కాసాల మల్లారెడ్డిని ఆయన అభినంధించారు.
ఈ సందర్భంగా సోమే్షకుమార్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పారిశుధ్య నిర్వహణ, హరితహారంతో మున్ముందు మరిన్ని మంచి ఫలితాలు కన్పిస్తాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామ పంచాయితీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంక్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు.. డంపుయార్డు, వైకుంఠదామాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. వర్షాకాలంలో హరితహారం మొక్కలను నాటడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పార్కులు ఉన్నాయని, గ్రామాల్లో కూడా పార్కులు ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని జిల్లా అధికారులకు సూచించారు.
జిల్లాలో శానిటైజేషన్, హారితహారం పనులు బావున్నాయని, అంకితభావంతో పని చేశారని కలెక్టర్ హన్మంతరావును, అధికారులను సీఎస్ అభినంధించారు. అభివృద్ధిలో ఎద్దుమైలారం అన్ని గామాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఆయన వెంట పంచాయితీ రాజ్ రూరల్ డెవల్పమెంట్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు, కలెక్టర్ ఎం.హన్మంతరావు, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీ కాల్వ సరళ, జడ్పీటీసీ కొండల్రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జయలక్ష్మి, సర్పంచ్ కాసాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నర్సరీలను మరింత అభివృద్ధి చేయాలి
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ నర్సరీలను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం కొండాపూర్ మండల పరిధిలోని గుంతపల్లి గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీ, డంపుయార్డు, శ్మశానవాటికను పరిశీలించారు. నర్సరీని మరింత అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు. నర్సరీల పెంపకంలో కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు.
పారిశుధ్యంపై మరింత దృష్టి సారించాలన్నారు. శ్మశానవాటిక, డంపుయార్డు పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హన్మంతరావు, పంచాయతీరాజ్ అదనపు కార్యదర్శి రఘునందన్, డీఆర్డీఏ శ్రీనివా్సరావు, డీపీవోఏ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, ఎంపీపీ మనోజ్రెడ్డి, సర్పంచ్ సుమిత్ర, తహసీల్దార్ బలరాముడు, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, డీఎస్పీ శ్రీధర్రెడ్డితో పాటు జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.