అదో భయంకర అనుభవం: సానియా మీర్జా

ABN , First Publish Date - 2021-01-19T23:27:05+05:30 IST

తాను కరోనా బారినపడినట్టు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

అదో భయంకర అనుభవం: సానియా మీర్జా

హైదరాబాద్: తాను కరోనా బారినపడినట్టు  టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను కరోనా మహమ్మారి బారినపడ్డానని, దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపింది. అయినప్పటికీ తన అనుభవాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. తాను వైరస్ బారినపడినప్పటికీ పెద్దగా లక్షణాలు కనిపించలేదని వివరించింది. అయినప్పటికీ తాను ఐసోలేషన్‌లోనే ఉన్నానని, ఈ కాలంలో తన రెండేళ్ల కుమారుడు, కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండడం మాత్రం చాలా కష్టంగా అనిపించిందని వాపోయింది.


కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆసుపత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలా గడిపాయోనన్న విషయాన్ని తాను ఊహించుకోలేకపోతున్నానని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని, భౌతికంగా, మానసికంగా ఎంతో మథనపడతామని పేర్కొంది. 


మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత నేనో విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, కొద్దో గొప్పో తాను అదృష్టవంతురాలినని సానియా పేర్కొంది. అయితే, కుటుంబం నుంచి దూరంగా ఉండడం మాత్రం భయంకరమైన విషయమని చెప్పుకొచ్చింది. వారిని తిరిగి ఎప్పుడు చూస్తామో తెలియదని,  ఎందుకంటే ఈ వైరస్ జోక్ కాదని పేర్కొంది.


వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉందని, స్నేహితులు, కుటుంబాలను  కాపాడుకోవడానికి  అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మనల్ని, మన ఆత్మీయుల్ని కాపాడుకోవడానికి మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సానియా సూచించింది. 

Updated Date - 2021-01-19T23:27:05+05:30 IST