ఇసుకాసురులు

ABN , First Publish Date - 2022-04-29T03:41:52+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమార్కులు నిబంధనలకు పాతరేసి అడ్డ గోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు.

ఇసుకాసురులు
లోగో

- యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా
 - వాగులను కొల్లగొడుతున్న అక్రమార్కులు
- అడుగంటుతున్న భూగర్భ జలాలు
- మామూళ్ల మత్తులో రెవెన్యూ, పోలీసు యత్రాంగం

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 28: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమార్కులు నిబంధనలకు పాతరేసి అడ్డ గోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఫలితంగా వాగులు, వంకలన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేకపోయినా ట్రాక్టర్ల యజమానులు ఒక్కో పర్మిట్‌పై పదేసి ట్రిప్పుల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు రెవెన్యూ, పోలీసు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాక్టర్‌ యజమానుల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు 2 వేల రూపాయల చొప్పున వసూలు చేస్తూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- పెద్దవాగు మొదలుకుని..
ఆసిఫాబాద్‌ పట్టణ శివారులోని పెద్దవాగు మొదలుకుని దహెగాం మండలంలోని ఎర్రవాగు వరకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న ఇసుక చోరులు మాఫీయాను తలదన్నే రీతిలో ఏకంగా ఎక్స్‌కావేటర్‌, డోజర్లు వంటి వాటిని వినియోగించి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.  వాస్తవానికి కుమరం భీం జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్‌లు గుర్తించలేదు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతో స్మగ్లర్లు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను ఇసుకకు 2,000 నుంచి 2,500 రూపాయల వరకు ధర పలుకుతోంది. నిబంధనల ప్రకారం లారీలలో ఇసుక తరలించరాదన్న ఆదేశాలు ఉన్నాయి. దీంతో  అక్రమార్కులు వ్యూహాత్మకంగా రూట్‌ మార్చి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేస్తూ అక్కడి నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు.  రెబ్బెన మండలంలోని గంగాపూర్‌, పులికుంట, కొండపల్లి వాగులతో పాటు దహెగాం మండలంలోని కల్వాడ ఎర్రవాగు, పెద్దవాగు, కౌటాల మండలంలోని ముత్తంపేట, తాట్‌పల్లి వాగులు, చింతలమానెపల్లి మండలంలోని రుద్రాపూర్‌, చింతలమానెపల్లి, కాగజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి, పెద్దవాగు, కెరమెరి మండలంలోని సాంగ్వీ, కైరి వా గు, సిర్పూర్‌(టి) మండలంలోని పెద్దబండ వాగుల నుంచి అక్రమార్కులు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా సంబంధిత రెవెన్యూ అధికారులు, పోలీసులకు తెలిసినా ఇసుక సిండికేట్లు  వారికి నెల వారీగా ముడుపులు అప్పగిస్తుండడంతో పట్టించుకో వడం లేదని ప్రజలు వాపోతున్నారు.

- పడిపోతున్న భూగర్భ జలమట్టం..
వాగుల్లో ఇసుక తవ్వకాల మూలంగా భూగర్భ జలమట్టం దారుణం గా పడిపోతున్నట్లు  భూగర్భ జల వనరుల శాఖ సేకరించిన సర్వేల్లో వెల్లడైంది.  ముఖ్యంగా వాగులు, ఒర్రెలు ఉన్న పరిసరాల్లో  ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, గూడాల్లో  వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. నిబంధనల ప్రకారం నదులు, ఉప నదుల్లోనే మీటర్‌ లోతుకు మించి ఇసుక తవ్వకాలు జరపడం నిషేధం. వాల్టా చట్టాన్ని అనుసరించి వాగులు, వంకల్లో అసలు ఇసుకే తీయరాదు. కాగా జిల్లాలో అక్రమార్కులు నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమంగా ఇసుక దోపిడీకి పాల్పడుతుండడం గమనార్హం. ఉన్నతాధికారులు ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లావా సులు కోరుతున్నారు.

నిఘా ముమ్మరం..
- నాగరాజు, ఏడీ మైనింగ్‌శాఖ

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు నిఘా ముమ్మరం చే శాం. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నాం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు పట్టుకుని యాజమానులకు జరిమానా వేస్తున్నాం. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-04-29T03:41:52+05:30 IST