ఇసుక స్మగ్లర్ల బరితెగింపు
ABN , First Publish Date - 2021-03-01T04:26:41+05:30 IST
ఇసుక స్మగ్లర్లు బరితెగించారు. అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్ఈబీ అధికారుల కారునే తమ కారుతో ఢీ కొట్టారు.
ఎస్ఈబీ కారును ఢీ కొట్టిన స్మగ్లర్ల కారు
ఇసుక టిప్పర్ పరారీ
పట్టుబడిన స్మగ్లర్, కారు
తడ, ఫిబ్రవరి 28 : ఇసుక స్మగ్లర్లు బరితెగించారు. అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్ఈబీ అధికారుల కారునే తమ కారుతో ఢీ కొట్టారు. ఇసుక టిప్పర్ పరారవ్వగా స్మగ్లర్ల ఇన్నోవా కారు, ఓ స్మగ్లర్ను ఎస్ఈబీ అధికారులు పట్టుకు న్నారు. శనివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. తడ మీదుగా చెన్నైకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఎస్ఈబీ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందింది. ఎస్ఈబీ సబ్ ఇన్స్పెక్టర్ విజయశ్రీనివాస్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం తడ నుంచి చెన్నై వైపు వేగంగా ఓ ఇసుక టిప్పర్ వెళ్తుండటాన్ని గుర్తించారు. వెంటనే కారులో ఆ టిప్పర్ను వెంటపడ్డారు. ఈ క్రమంలోనే ఆ టిప్పర్కు ఎస్కార్ట్గా ఓ కారు వెళ్తుండటాన్ని గుర్తించారు. వాటిని పట్టుకునే ప్రయత్నంలో ఎస్ఈబీ అధికారులు కారు వేగాన్ని పెంచారు. రాష్ట్ర సరిహద్దు పన్నంగాడు వద్దకు వచ్చేసరికి ఎస్ఈబీ అధికారుల కారు ఆ రెండు వాహనాలను ఓవర్టేక్ చేసి ఆపే ప్రయత్నం చేశారు. దాంతో బరితెగించిన స్మగ్లర్లు తమ కారుతో అధికారుల కారును ఢీ కొట్టారు. దీంతో అదుపుతప్పిన స్మగ్లర్ల వాహనం రోడ్డుదిగి చెట్లలోకి దూసుకుపోయి ఆగిపోయింది. ఊహించని ఈ సంఘటన నుంచి ఎస్ఈబీ అధికారులు తేరుకునే లోపే ఇసుక టిప్పర్ పరారైంది. అధికారులు స్మగ్లర్ల వాహనం వద్దకు చేరుకునేసరికే అందులో ఉన్న ఓ వ్యక్తి పరారవగా భాస్కర్ వెళ్లిపోతుండగా పట్టుకున్నారు. అనంతరం అతడిని సూళ్లూరుపేట ఎస్ఈబీ కార్యాలయానికి తరలించి విచారణ చేశారు. రాత్రి తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.