ప్రభుత్వ పనుల ముసుగులో ఇసుక దందా
ABN , First Publish Date - 2022-09-29T06:19:13+05:30 IST
నియోజకవర్గంలోని ప్రభుత్వం పనుల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సరిహద్దులు దాటుతున్న వైనం
గానుగపాడు(తిరువూరు), సెప్టెంబరు 28: నియోజకవర్గంలోని ప్రభుత్వం పనుల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గానుగపాడు, చింతలపాడు వాగుల నుంచి బుధవారం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తోలకాలు జరిపారు. విస్సన్నపేట, ఎ.కొండూరు, మండలాలతో పాటుగా తిరువూరు పట్టణం, మండలంలో జరుగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాలు, జగనన్న ఇళ్లు, సిమెంట్ రహదారుల నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారుల సిఫార్సు మేరకు ఎంపీడీవో కార్యా లయం కూపన్లు జారీ చేస్తుంది. వాటితో ఇసుకను అధిక ధరకు సరిహద్దులు దాటిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల భవనాల అసంపూర్తిగా ఉన్నాయి. వాటి పేరుతో ఇసుక కూపన్లు తీసుకొని అధిక ధరకు బయట వ్యక్తులకు విక్రయిస్తున్నారని పలువురు అంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే విజయవాడ నుంచి ఇసుక తెచ్చుకోమని సిబ్బంది ఉచిత సలహాలిస్తున్నారని స్థానికులంటున్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా ఏ శాఖ అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక ఎక్కడికి వెళుతుంతో మాకు సంబంధంలేదు..
ఫణిగోపాల్, పంచాయతీ కార్యదర్శి, గానుగపాడు
ఇంజనీరింగ్ శాఖాధికారి సూచన మేరకు ఇసుక కూపన్లు జారీ చేస్తున్నాం. కూపన్లో పేర్కొన్న ప్రాంతంలో ఇసుక దిగుమతి అయింది, లేనిదీ సంబంధిత సిబ్బంది తమకు సమాచారం ఇవ్వమని కోరుతున్నా స్పందించటం లేదు. వాగు నుంచి ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఎక్కడికి వెళుతుందో తమకు సంబంధం లేదు.