ఇసుక రీచ్‌లో వాహనాల అడ్డగింత

ABN , First Publish Date - 2021-06-24T04:18:19+05:30 IST

మండలంలోని మినగల్లు ఇసుకరీచ్‌లో బుధవారం ఇసుక రవాణా చేసే వాహనాలను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.

ఇసుక రీచ్‌లో వాహనాల అడ్డగింత
మినగల్లు ఇసుక రీచ్‌లో నిర్వాహకులకు, స్థానిక ప్రజల మధ్య ఏర్పడిన వివాదం

20 అడుగులకుపైగా లోతు తవ్వకాలపై అభ్యంతరం

రీచ్‌ నిర్వాహకులు, ప్రజల మధ్య వాగ్వాదం 


బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 23:  మండలంలోని మినగల్లు ఇసుకరీచ్‌లో బుధవారం ఇసుక రవాణా చేసే వాహనాలను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. రీచ్‌లో నిత్యం ఐదుకు పైగా ఎక్స్‌కవేటర్లతో 20 అడుగులకు పైగా లోతుతో  తవ్వకాలు జరుపుతుండడంతో భూగర్భ జలాలు బయటపడుతుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గంటకు పైగా ఇసుక లోడింగ్‌ పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రీచ్‌ గుత్తేదారు తరపున స్క్వాడ్‌ బృందానికి, స్థానిక ప్రజలకు మధ్య సుమారు గంటపాటు వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. భవిష్యత్‌లో మినగల్లుతోపాటు మండల వ్యాప్తంగా రైతులు సాగు, తాగునీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆవేదన చెందారు. గంటకు పైగా ఇసుక లోడింగ్‌ పనులు ఆగిపోవడంతో ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అదే విధంగా ఇసుకలోడ్‌ చేసుకున్న వాహనాలకు బిల్లులో తక్కువ టన్నేజీవేసి, అదనపు లోడింగ్‌కు వేరుగా నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ట్రాక్టర్లకు లోడ్‌ చేసిన మేరకు బిల్లులు ఇవ్వాలని, అదనంగా ఇసుక లోడు చేయవద్దని సిబ్బందికి సూచించారు. రీచ్‌లో యంత్రాలతో తోడే తవ్వకాలకు లోతు పరిమితం అనే నిబంధనలు లేవని రీచ్‌ నిర్వాహకుల్లో ఒకరు చెప్పడం విశేషం. 

Updated Date - 2021-06-24T04:18:19+05:30 IST