ఇసుక ధరకు.. రెక్కలు
ABN , First Publish Date - 2022-07-19T05:40:02+05:30 IST
తెలంగాణలో కురుస్తోన్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోండటంతో ఇసుక ధర అమాంతం పెరిగిపోయింది.
కృష్ణానదికి వరదతో ధర రెట్టింపు
స్టాక్యార్డు వద్ద టన్నుకు రూ.925 వసూలు
రవాణా చార్జీలతో కలిపి రూ.1,400లకు చేరిక
25 టన్నుల 10 టైర్ లారీ ఇసుక రూ.35 వేలు
గుంటూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కురుస్తోన్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోండటంతో ఇసుక ధర అమాంతం పెరిగిపోయింది. వరద కారణంగా రీచ్ల్లో నుంచి ఇసుక తీయలేని పరిస్థితి తలెత్తింది. కృష్ణా జిల్లా నుంచి తీసుకొస్తోన్న ఇసుక ధరని ఇక్కడ భారీగా పెంచి విక్రయిస్తోన్నారు. దీంతో నిర్మాణ రంగంలో మళ్లీ ఆటంకాలు తలెత్తాయి. పెరిగిన ఇసుక ధరతో చాలామంది భవన నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపేశారు. అలానే కొత్తగా నిర్మాణం ప్రారంభించాల్సిన వాటిని వాయిదా వేస్తోన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోండటం, ఆ జలాశయం నిండి నాగార్జున సాగర్కు వరద వచ్చి అక్కడి నుంచి దిగువకు విడుదలైతే ఇసుకకు మరింత కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు సప్లయర్స్ చెబుతున్నారు. కృష్ణా నదికి వరద పోటెత్తకముందు జిల్లాలోని ఎక్కువ రీచ్ల్లో తవ్వకాలు జోరుగా కొనసాగుతూ వచ్చాయి. దాంతో స్టాక్యార్డుల వద్ద టన్ను రూ.475కి విక్రయించారు. రవాణ చార్జీలు కలుపుకుంటే రూ. 800లకు టన్ను ఇసుక లభించేది. 25 టన్నుల 10 టైర్ల లారీ ఇసుక ఆర్డర్ చేస్తే రూ.20 వేలకు తీసుకొచ్చి డంపింగ్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇసుక రీచ్ల్లోకి వరద నీరు రావడంతో చాలావరకు అవి మూసేశారు. ప్రస్తుతం చింతపల్లిపాడుకు అవతలి ఒడ్డున కృష్ణా జిల్లా నుంచి ఇసుక తీసుకొస్తున్నారు. అన్ని చార్జీలు కలుపుకుంటే అక్కడి నుంచి వచ్చే ఇసుకకి టన్ను రూ.1400 వరకు గుంటూరు నగరంలో వసూలు చేస్తోన్నారు. పిడుగురాళ్ల, చిలకలూరిపేట, గురజాల, నరసరావుపేట వంటి ప్రాంతాల్లో ధర మరింత ఎక్కువగా ఉంటోన్నది. వరద కారణంగా లారీకి దాదాపు రూ.15 వేల వరకు ధర పెరిగినట్లుగా సప్లయర్లు చెబుతున్నారు.
గత ఏడాదీ ఇదే పరిస్థితి..
గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితే జిల్లాలో ఉత్పన్నమైంది. అప్పట్లో అధికార యంత్రాంగం కాస్త ముందుచూపుగా వ్యవహరించి కృష్ణానదికి వరదలు రాకముందే 20 లక్షల టన్నుల ఇసుకని వేసవిలోనే స్టాక్యార్డులకు తరలించింది. దాంతో మూడు నెలల పాటు వరద కొనసాగినా ధర కొద్దిగా పెరిగిందే తప్ప రెట్టింపు అయితే కాలేదు. ఈ సంవత్సరం జిల్లాల విభజనతో ఇసుకపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కొన్ని ఇసుక రీచ్లు పల్నాడు, మరికొన్ని బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయాయి. దీంతో గుంటూరు జిల్లా కేవలం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లోని ఇసుక రీచ్ల పైనే ఆధారపడాల్సిన వస్తోన్నది. జిల్లా యంత్రాంగం కూడా ఇసుక కొరత గురించి ముందుగా అంచనా వేయలేదు. వేసవిలో కనీసం మైనింగ్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదు. దీంతో జిల్లాలోని స్టాక్యార్డుల్లో ఇసుక నిల్వలు పెద్దగా లేకుండా పోయాయి. ఇప్పుడు రీచ్లు మూతబడటంతో ధరకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.