ఇసుక తరలింపు జీఓను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-07-04T10:56:10+05:30 IST
ఇసుక తరలింపు జీఓను ఉపసంహరించుకోవాలని మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామ శివారులో గల
అల్లీపురం వంతెనపై రైతుల రాస్తారోకో
చిన్నచింతకుంట, జూలై 3 : ఇసుక తరలింపు జీఓను ఉపసంహరించుకోవాలని మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామ శివారులో గల ఊకచెట్టువాగు వంతెనపై రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఊకచెట్టు వాగు నుంచి ఇసుకను తరలించే జీఓను ఉన్నతాధికారులు వెంటనే ఉపసంహరించుకోవాలని కురుమూర్తి, మద్దూరు, అల్లీపురం గ్రామాలకు చెందిన రైతులు వాగు వంతెనపై గల ఆత్మకూర్, హైదరాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దీక్ష చేసిన రైతులకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రైతు కుర్వ రమేష్ మాట్లాడుతూ బండర్పల్లి నుంచి కొత్తపల్లి వరకు విస్తరించిన ఊకచెట్టువాగును పూర్తిగా కొల్లగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అధికారులతో కలిసి కుమ్మక్కై ఇసుకను ఇక్కడి నుంచి తరలించేందుకు కుట్రలు చేయటం రైతులను వంచించటమేనని ఆరోపించారు. ఇసుకను తీయడం వల్ల చాలా గ్రామాల్లో తాగు, సాగు నీటి సమస్య ఏర్పడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి జీఓను రద్దు చేయకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నిరసనను విరమించారు.