చెక్డ్యాం పేరుతో ఇసుక దందా
ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST
మూసీ వాగు నుంచి చెక్ డ్యాంల పేరుతో ఇసుకను తరలిస్తున్నారు. రెండు భారీ ఎక్స్కవేటర్లతో ఇసుకను తోడేస్తున్నారు.
సూర్యాపేటరూరల్, జూలై 30 : మూసీ వాగు నుంచి చెక్ డ్యాంల పేరుతో ఇసుకను తరలిస్తున్నారు. రెండు భారీ ఎక్స్కవేటర్లతో ఇసుకను తోడేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. సూర్యాపేట మండలం టేకుమట్ల మూసీ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా రెండు రోజులుగా కొనసాగుతోంది. వాగులో భారీగా డంప్ చేసి సూర్యాపేటకు తరలిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామపంచాయతీ అనుమతి కూడా తీసుకోకుండా యఽథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతుండంతో పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామస్థులు అవసరాల కోసం ట్రాక్టర్తో ఒకటి రెండు ట్రిప్పులను రవాణా చేస్తే అడ్డుకునే పోలీసులు, రెవెన్యూ అధికారులు వందలటిప్పర్లలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెక్ డ్యాంల పేరుతో ఇసుక తరలింపు
చెక్ డ్యాంల పేరుతో బడా కాంట్రాక్టర్ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రి ఇసుకను భారీగా డంప్ చేసి టిప్పర్లతో సూర్యాపేటకు తరలిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో చెక్ డ్యాం పనులు జరుగుతున్నాయని; ఇసుక రవాణాను బంద్ చేయించి వందల మంది కూలీలకు పనిలేకుండా చేసిన అధికారులు, పోలీసులు ఇసుక రవాణాను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు
గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకుండా ఇసుకను రవాణా చేస్తు న్న వాహనాలను సర్పంచ్, గ్రామస్థులు కలిసి గురువారం అడ్డుకున్నా రు. ఇసుకను వాహనాల నుంచి వాగులో పోయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఇసుకను పోసి వెళ్లిపోయారు. అంతకు ముందు సుమారు వందల ట్రిప్పుల ఇసుకను సూర్యాపేట ఎల్ఐసీ ఆఫీస్ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో డంప్ చేశారని గ్రామస్థులు తెలిపారు.
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు
మూసీ వాగు నుంచి ఇసుకను తరలించాడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటాం.
- వెంకన్న, తహసీల్దార్ , సూర్యాపేట