యథేచ్ఛగా ఇసుక దందా

ABN , First Publish Date - 2020-10-31T07:12:33+05:30 IST

సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌న గర్‌తో పాటు పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు ఒక్క వే బిల్లుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇసుక రవాణా

యథేచ్ఛగా ఇసుక దందా

ఒక్క వే బిల్లుపై ట్రాక్టర్లలో పలుమార్లు అక్రమంగా తరలింపు

పట్టించుకోని అధికారులు

లక్షలు గడిస్తున్న అక్రమార్కులు 


కాగజ్‌నగర్‌, అక్టోబరు 30: సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌న గర్‌తో పాటు పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు ఒక్క వే బిల్లుతో  ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తే వే బిల్లు చూపించి బయట పడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్‌, రెవెన్యూ అధికా రులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులు ఇసుకను రాత్రి వేళల్లో కాగజ్‌నగర్‌ నుంచి నేరుగా లారీల్లో హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 


నిబంధనలకు పాతర..

ఇసుక తరలింపులోనూ నిబంధనలు పాటించడం లేదు. పెద్దవాగు, రాస్పెల్లి, ఇతర వాగుల్లో ఉదయం 10 గంటల తర్వాత లోడింగ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే డంపింగ్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. వేబిల్లు ఉన్న వాటికి మాత్రమే ఒక్క ట్రిప్పు ఇసుక తరలించేందుకు వినియోగించాల్సి ఉంటుంది. కచ్చితంగా నిబంధనలు పాటించేలా రెవెన్యూ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాల్సి ఉంటుంది. నిత్యం కాగజ్‌నగర్‌ మండలం రాస్పెల్లి, పెద్దవాగు ప్రాంతాల్లో వేకువజాము నుంచి మొదలు కొని రాత్రిళ్లు యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించు కోవచ్చు. 


పలు చోట్ల డంప్‌..

సిర్పూర్‌ నియోజకవర్గంలోని వివిధ మండలాల వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి పలు ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీల్లో కాగజ్‌నగర్‌ మీదుగా హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమార్కులు సంబంధిత శాఖల అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాతో వాగుల్లో నీటి మట్టం పడిపోతోంది. ఇసుక అక్రమ రవా ణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించినా కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో వాల్టా చట్టానికి తూట్లు పడుతు న్నాయని పలువురు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గట్టి చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ విషయమై కాగజ్‌నగర్‌ తహ సీల్దార్‌ ప్రమోద్‌ను వివరణకోరగా అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-10-31T07:12:33+05:30 IST