నమ్మినోళ్ల కంట్లో ఇసుక
ABN , First Publish Date - 2020-08-09T11:23:01+05:30 IST
ఇసుకను భారీగా బుక్ చేసి లబ్ధి చేకూరుస్తానని చెప్పి రూ.12 లక్షలకు టోకరా వేసిన ఏపీఎండీ డేటా ఎంట్రీ ఆపరేటర్ను పోలీసులు అరెస్టు ..
బల్క్గా బుక్ చేస్తానని మాయమాటలు
నకిలీ డీడీల జారీ ఫ రూ.12 లక్షలు వసూలు
ఎట్టకేలకు పోలీసుల చేతికి..
సర్పవరం జంక్షన్, ఆగస్టు 8: ఇసుకను భారీగా బుక్ చేసి లబ్ధి చేకూరుస్తానని చెప్పి రూ.12 లక్షలకు టోకరా వేసిన ఏపీఎండీ డేటా ఎంట్రీ ఆపరేటర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను శనివారం డీఎస్పీ వి.భీమారావు వెల్లడించారు. అమలాపురం రూరల్ మండలం జనుపల్లిలో ఎంఎస్ఎన్ కాలనీకి చెందిన పెదమల్లు దామోదర శ్రీనివాస్ ఏపీఎండీసీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో ఇసుక తక్కువ ధరకు బల్క్ ఆర్డర్లో బుక్ చేస్తానని బంధువులు, స్నేహితులకు మాయమాటలు చెప్పి పలువురు నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులను విజయవాడ రూరల్ ప్రసాదంపాడుకు చెందిన యార్లగడ్డ సాయి కార్తీక్తోపాటు బంధువుల బ్యాంకు అకౌంట్లలో బదిలీ చేయించాడు. తర్వాత తన బ్యాంకు అకౌంట్కి ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేయించుకునేవాడు. ఇసుక బుక్ చేస్తున్నట్టు డబ్బులు తీసుకుని నకిలీ డీడీలు ఇచ్చాడు.
ఈ డీడీలతో ఇసుక కోసం వెళితే అవి నకిలీవని తేలడంతో శ్రీనివాస్ మోసాన్ని గుర్తించిన తాళ్లరేవు మండలం గోవలంకకు చెందిన బాధితుడు మోర్త మల్లికార్జునరావు కోరంగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నకిలీ డీడీలు ఇవ్వడమే కాకుండా బల్క్ఆర్డర్స్ రద్దు అయినట్టు బాఽదితులను మోసం చేశారని డీఎస్పీ భీమారావు తెలిపారు. మోసం చేసి తీసుకున్న డబ్బుతో ఆన్లైన్ గేమ్స్ ఆడినట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శనివారం కాకినాడలో గాలిస్తుండగా ఏ1 నిందితుడు పెదమల్లు దామోదర శ్రీనివాస్, ఏ2 యార్లగడ్డ సాయికార్తీక్ పట్టుబడ్డారన్నారు. సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను నిలుపుదల చేశామన్నారు