ఇసుక.. ఇష్టారాజ్యం
ABN , First Publish Date - 2021-08-25T05:03:12+05:30 IST
ఇసుక అందరికీ కాదు.. కొందరికే అన్నట్లుగా ఉంది. స్టాక్ యార్డుల్లో కూడా లోడింగ్ ఇష్టారాజ్యంగా జరుగుతుంది. సీరియల్ విధానం పాటించడంలేదు.
ఓబులునాయుడుపాలెంలో అధికార హవా
సీరియల్ విధానం లేకుండానే యార్డులో లోడింగ్
అధికార పార్టీ నాయకుడి లారీలకు అధిక ప్రాధాన్యం
అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు లారీ యజమానులు సిద్ధం
గుంటూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఇసుక అందరికీ కాదు.. కొందరికే అన్నట్లుగా ఉంది. స్టాక్ యార్డుల్లో కూడా లోడింగ్ ఇష్టారాజ్యంగా జరుగుతుంది. సీరియల్ విధానం పాటించడంలేదు. రాజకీయ అండ ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అంతేగాకుండా వైసీపీ నేతల లారీలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, పర్మిట్లు చూడటం లేదు. మిగతా వారికి మాత్రం భూతద్దం పెట్టి మరీ పరిశీలించి పెనాల్టీలు విధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఓబులునాయుడుపాలెం ఇసుక స్టాక్యార్డులో కూడా ఇలాగే జరుగుతుంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇక్కడ లారీలకు ఇసుక లోడింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి అనుచరుల లారీలు సీరియల్తో సంబంధం లేకుండా లోడింగ్ చేసి పంపిస్తున్నారు. మిగతా వారికి మాత్రం సీరియల్ అంటూ ఉదయం వెళ్లిన లారీకి సాయంత్రానికి ఒక్క ట్రిప్పు లోడింగ్ చేస్తున్నారు. కొందరైతే లోడింగ్ కోసం రెండు రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక సరఫరా ఓబులునాయుడుపాలెంలోని స్టాక్యార్డు నుంచి జరుగుతుంది. ఇది నగరానికి దూరంగా ఉండటంతో నిఘా కూడా తక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాలు సైతం అక్కడికి వెళ్లి ఆందోళనలు చేయలేని పరిస్థితి. ఇదే అదనుగా వైసీపీకి చెందిన ఓ నాయకుడు తనకున్న లారీలను నేతల అండదండలతో ఇక్కడికి పంపిస్తున్నాడు. ఆయన లారీలు వస్తే క్యూలైన్తో సంబంధం లేకుండా లోడింగ్ చేయాలని అనధికార ఆదేశాలు ఉన్నాయి. దీంతో అక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా లోడింగ్ చేస్తున్నారు. ఆ నాయకుడికి ఉన్న 10 లారీలు ఇక్కడి నుంచి రోజుకు 50 ట్రిప్పుల వరకు ఇసుకని తరలించి సొమ్ము చేసుకొంటున్నారు. మిగతా లారీ యజమానులు/డ్రైవర్లు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. రోజుకు ఒక ట్రిప్పే వేయడంతో లారీ నిర్వహణ, ఇంధన, డ్రైవర్ కూలీ కూడా రాదని యజమానులు వాపోతున్నారు.
ప్రశ్నిస్తే.. ప్రమాదాలే
ట్రిప్పుల విషయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇక ఆ లారీకి ఇసుక లోడింగ్ చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని సమాచారం. ఇటీవల ప్రత్తిపాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్ కొంచెం గట్టిగా మాట్లాడటంతో అతడి లారీని వైసీపీ నాయకుడి లారీతో ఢీ కొట్టించారు. ఆ సంఘటనలో ప్రత్తిపాడుకు చెందిన లారీకి తీవ్ర నష్టం వాటిల్లింది. అదేమంటే చూడక తగిలిందని, చేతిలో రూ.2 వేలు పెట్టి సర్దుకోమన్నారు. ఈ నేపథ్యంలో ఓబులునాయుడుపాలెం స్టాక్యార్డులో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్, సీఎంవోకి ఫిర్యాదు చేసేందుకు లారీ యజమానులు సిద్ధమయ్యారని తెలిసింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.