స్మృతి ఇరానీ నియోజకవర్గంలోని ఆ గ్రామంలో కరోనా విలయతాండవం
ABN , First Publish Date - 2021-05-17T14:55:25+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది.
అమేఠీ: ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. నెల రోజుల వ్యవధిలో 20 నుంచి 30 మంది కరోనా బాధితులు మరణించిన గ్రామాలు అనేకం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఈరోజుకీ ఆయా గ్రామాల్లో కనీసం కరోనా టెస్టులు కూడా నిర్వహించకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటరీ నియోజకవర్గం అమేఠీలోని ఒక గ్రామంలో ఇటువంటి భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
అమేఠీలోని హరిమౌ గ్రామంలో కరోనాతో 20 మంది మృతిచెందారు. గ్రామంలో ఎన్నడూ ఈ విధమైన మరణాలు చోటుచేసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రాజేంద్ర కౌశల్ మాట్లాడుతూ గ్రామంలోని కొన్ని ఇళ్లలో ముగ్గురు చొప్పున మృతి చెందారన్నారు. గ్రామానికి చెందిన షహ్నవాజ్ మాట్లాడుతూ తమ గ్రామంలో చోటుచేసుకుంటున్న మరణాలకు కారణం ఏమిటో తెలియడం లేదన్నారు. అయితే కొంతకాలం క్రితం ఆరోగ్య శాఖ బృందం వచ్చి మందులు ఇచ్చి వెళ్లిపోయిందన్నారు. గ్రామంలో చోటుచేసుకుంటున్న మరణాలపై గ్రామస్తులు భయపడుతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ గ్రామం గురించి పట్టించుకోని స్మృతి ఇరానీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.