భారతీయ సంగీతం, నృత్యాల కోసం అమెరికాలో 'సిలికానాంధ్ర సంపద'

ABN , First Publish Date - 2020-07-07T04:12:56+05:30 IST

విదేశాల్లో నివసిస్తూ కూచిపూడి, భరత నాట్యం, ఆంధ్ర నాట్యంలో తమ తమ గురువుల వద్ద శిక్షణ పొందుతన్న విద్యార్ధులకు అమెరికాలోని సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడెమి(సంపద) అకడమిక్ క్రెడిట్స్‌తో కూడిన జూనియర్, సీనియర్ సర్టిఫికెట్స్ అందిస్తోంది. కరోనా మహమ్మారి వణికిస్తున్నప్పటికి ఏప్రిల్, మే నెలల్లో..

భారతీయ సంగీతం, నృత్యాల కోసం అమెరికాలో 'సిలికానాంధ్ర సంపద'

న్యూజెర్సీ: విదేశాల్లో నివసిస్తూ కూచిపూడి, భరత నాట్యం, ఆంధ్ర నాట్యంలో తమ తమ గురువుల వద్ద శిక్షణ పొందుతన్న విద్యార్ధులకు అమెరికాలోని సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడెమి(సంపద) అకడమిక్ క్రెడిట్స్‌తో కూడిన జూనియర్, సీనియర్ సర్టిఫికెట్స్ అందిస్తోంది. కరోనా మహమ్మారి వణికిస్తున్నప్పటికి ఏప్రిల్, మే నెలల్లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అధికారుల అంతర్జాల పర్యవేక్షణ ద్వారా కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యాలలో 1500కి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. వీరంతా సంపదలో తమ పేర్లను నమోదు చేసుకోగా.. పరీక్షలు, మూల్యాంకనం నిర్వహించి ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు  జూనియర్, సీనియర్ సర్టిఫికేట్‌లలో ధృవీకరణ పత్రాలు అందించడం జరిగింది. విద్యార్ధులెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా సంపద సునాయాసంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది. 


ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి , తెలుగు విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శ్రీమతి డా. రెడ్డి శ్యామల నాయకత్వంలోని అధికారుల బృందం కృషి ఎంతో ఉన్నదని సంపద డీన్, అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కాదలచిన విద్యార్ధులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల పిల్లలు, పెద్దల మనసుకు స్వాంతన చేకూర్చే ఎన్నో కార్యక్రమాలకు సంపద శ్రీకారం చుట్టింది. అమెరికాలో నివసిస్తున్న చిన్నారులకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద అభిరుచిని పెంచటానికి అంతర్జాలం ద్వారా ఓ వేదికను ఏర్పాటు చేసింది. అన్నమయ్య, రామదాసు, పురందర దాసు లాంటి  వాగ్గేయ కారుల గొప్పతనాన్ని రాబోయే  తరం చిన్నారులకు పరిచయం చేసి వారు రచించిన కీర్తనల మీద పోటీల నిర్వహణకు సంపద శ్రీకారం చుట్టింది. ఈ పోటీల గురించి ప్రకటించిందే తడవుగా అమెరికా వ్యాప్తంగా 550 మంది ఆసక్తితో నమోదు చేసుకొన్నారని సిలికానాంధ వాగ్గేయకార ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తెలిపారు. 


తొలి విడతగా జూన్‌లో ఐదు నగరాలలో నిర్వహించిన ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన  దాదాపు 65 మంది జూలై 11, 12 తేదీలలో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని వంశీకృష్ణ నాదెళ్ళ చెప్పారు. ఈ పోటీలకు అత్యంత కీలకమైన సాంకేతిక నిర్వహణ నాయకత్వ బాధ్యతను సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి నిర్వహిస్తున్నారు. సంపద నిర్వహిస్తున్న వాగ్గేయకార వైభవం కార్యక్రమానికి వస్తున్న అపూర్వ స్పందనను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 8-9 తేదిలలో కర్ణాటక సంగీత వాద్య పరికరాలయిన వీణ, వయోలిన్, ఫ్లూట్, మృదంగాలలో కుడా అంతర్జాలం ద్వారా  పోటీలు నిర్వహించటానికి సంపద శ్రీకారం చుట్టింది. కర్ణాటక సంగీత  వాద్య పోటీలలో పాల్గొనువారు వారి వయసును బట్టి కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులుగా పిలిచే త్యాగయ్య, దీక్షితార్, శ్యామ శాస్త్రిలు రచించిన కృతులను ఎంచుకోవాలని సంపద అధ్యక్షులు దీనబాబు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదితర ఇతర వివరాలకు vaggeyakara.siliconandhra.org వెబ్ సైట్‌ను సందర్శించవచ్చని చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలు ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చని దీనబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


కాగా.. సంపద నిర్వహిస్తున్న వాగ్గేయకార వైభవం కార్యక్రమం విజయవంతం కావడానికి నార్త్ కరోలినా నుంచి గౌతమి మద్దాలి, మల్లికా వడ్లమాని, వర్జీనియా నుంచి, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు  మాధురి దాసరి, రత్నవల్లి తంగిరాల, మాచిరాజు సుభ్రమణ్యం, న్యూ జెర్సీ నుంచి విజయ తురిమెల్ల, బాలు పసుమర్తి, లక్ష్మి నండూరి,రవి కామరసు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు శరత్ వేట, చికాగో నుంచి మాలతీ దామరాజు, శాంతి చతుర్వేదుల, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, కాలిఫోర్నియా నుంచి మమత కూచిభొట్ల, సృజన నాదెళ్ళ, నారాయణన్ రాజు, సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తదితరులు అత్యంత సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు.    

Updated Date - 2020-07-07T04:12:56+05:30 IST