వనదేవతల జాతరకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2021-01-25T04:26:18+05:30 IST
మండల పరిధిలోని రంగాపురం రహదారి పక్కన గుట్టపై కొలువు తీరిన సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది.
రేపటి నుంచి సమ్మక్కసారలమ్మ పండుగ
మూడు రోజులపాటు నిర్వహణ
రంగాపురం గుట్ట వద్ద సందడే సందడి
కరకగూడెం, జనవరి 24: మండల పరిధిలోని రంగాపురం రహదారి పక్కన గుట్టపై కొలువు తీరిన సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి జాతార ప్రారంభం కానుంది. కోయ తెగల సంప్రదాయం ప్రకారం నిర్వహిచనున్న ఈ జాతర మంగళవారం మండమెలుగు, అమ్మవార్లకు కుంకుమ పూజలతో ప్రారంభం కానుంది. బుధవారం ఒక్క పొద్దు నిర్వహిస్తారు. రాత్రి పది గంటలకు సారలమ్మను గుట్ట నుంచి కిందకు తీసుకొస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య గుడికి చేర్చుతారు. గురువారం నిండు జాతర సందర్భంగా మధ్యాహ్నం సమ్మక్కను గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు, మేళతాళాలతో గుడిలో కొలువు తీర్చుతారు. ఈక్రతువును చూసేందుకు రెండుకళ్లు చాలవు. జాతర పేరెన్నికగలది కావడంతో కరకగూడెం మండలం నుంచే కాకుండా పినపాక, ఆళ్లపల్లి, గుండాల, తాడ్వాయి, కాటాపురం, మంగపేట మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. గుట్ట పక్కన వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు మూడు రోజులపాటు ఇక్కడే ఉంటారు. కు టుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక విందులు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడుపుతుంటారు. ఈ ఆలయ నిర్వ హణను పూజారి ఢిల్లీ సరోజని వ్యవహరిస్తున్నారు. కాగా అమ్మవార్లను మరలా గుట్టకు చేర్చడంతో జాతర ముగుస్తుంది.
జాతర సందర్భంగా వాలీబాల్ పోటీలు
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కరకగూడెం, పినపాక, తాడ్వాయి మండలాల పరిధిలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి ఢిల్లీ సరోజిని తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. యువతలో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.