బాలబాలికలకు ఒకేవిధమైన యూనిఫాం... ముస్లిం సంఘాల అభ్యంతరం...

ABN , First Publish Date - 2021-12-16T22:23:03+05:30 IST

విద్యార్థినీ, విద్యార్థులకు ఒకే విధమైన యూనిఫాంను

బాలబాలికలకు ఒకేవిధమైన యూనిఫాం... ముస్లిం సంఘాల అభ్యంతరం...

తిరువనంతపురం : విద్యార్థినీ, విద్యార్థులకు ఒకే విధమైన యూనిఫాంను నిర్ణయించిన కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాల తీరును ముస్లిం సంఘాలు తప్పుబడుతున్నాయి. తల్లిదండ్రులతో సరైనవిధంగా చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించాయి. అయితే ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. విద్యార్థినీ, విద్యార్థులు ఒకే విధమైన యూనిఫాం ధరించి, తరగతులకు హాజరయ్యారు. 


కొజిక్కోడ్‌లోని బాలుసెరిలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ (జీహెచ్ఎస్ఎస్)లో 11వ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఒకే విధమైన యూనిఫాంను తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సంఘం నిర్ణయించింది. విద్యార్థినీ, విద్యార్థులు నీలి రంగు ప్యాంటు, చారలతో కూడిన తెల్ల చొక్కా ధరించాలని తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం సుమారు 200 మంది విద్యార్థినులు, 60 మంది విద్యార్థులు యూనిఫాం ధరించి, తరగతులకు హాజరవుతున్నారు. 


దీంతో వివిధ ముస్లిం సంఘాలు నిరసన తెలుపుతూ ఈ పాఠశాలకు ప్రదర్శనగా వెళ్ళాయి. తల్లిదండ్రులతో సరైన రీతిలో సంప్రదించకుడా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించాయి. సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. 


జీహెచ్‌ఎస్ఎస్ తల్లిదండ్రులు, టీచర్ల సంఘం అధ్యక్షుడు కే షిబు మాట్లాడుతూ, ఈ నూతన యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని తాము ఎవరినీ పట్టుబట్టడం లేదన్నారు. బాలబాలికలకు ఒకే విధమైన స్వేచ్ఛ ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్కార్ఫ్ ధరించాలని స్టూడెంట్స్ కోరుకుంటే, ధరించవచ్చునని తెలిపారు. 


Updated Date - 2021-12-16T22:23:03+05:30 IST