BJP: ఇతర భుజాలపై ఎక్కుతూ రాహుల్ ఉనికిని చాటుకుంటారు
ABN , First Publish Date - 2021-09-06T22:53:30+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ను ‘కోకిల’తో పోలుస్తూ విమర్శించారు. రాహుల్ ఎన్నడూ రాజకీయ క్షేత్రంలో పనిచేయరని, ఇతరు భుజాలపై ఎక్కుతూ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటారని తీవ్రంగా విమర్శించారు. కోకిల కూడా తనంతట తాను ఎన్నడూ గూడు కట్టుకోదని, ఇతర పక్షులు కట్టుకున్న గూడులో ఉంటుందని సంబిత్ పాత్రా పోల్చారు. రైతుల విషయంలో రాహుల్ లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్కు పూర్తికాలపు అధ్యక్షుడు ఇప్పటికీ లేడు. కార్యక్షేత్రంలోని సమస్యలను ప్రస్తావించడానికి కాంగ్రెస్కు సత్తా లేదు. అందుకే సోనియా నిత్యం వర్చువల్ మీటింగులు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ ఏమో రైతులకు సంబంధించిన పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు’’ అంటూ సంబిత్ పాత్రా తీవ్రంగా మండిపడ్డారు.