బీజేపీకి ఓ బహుమతి పంపిన సమాజ్వాదీ పార్టీ
ABN , First Publish Date - 2022-01-11T23:13:24+05:30 IST
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో గెలిచి తీరుతామనే ఆత్మవిశ్వాసం
లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో గెలిచి తీరుతామనే ఆత్మవిశ్వాసం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీకి రాజీనామా చేసిన కొందరు నేతలను చేర్చుకున్న తర్వాత ఎస్పీ అధికార ప్రతినిధి ఐపీ సింగ్ లక్నోలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఓ తాళం కప్పను బహుమతిగా పంపించేందుకు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు. బీజేపీ నేత స్వతంత్ర దేవ్ సింగ్ చిరునామాకు ఈ ఆర్డర్ను పంపించాలని నిర్దేశించారు.
ఓం ప్రకాశ్ రాజ్భర్, జయంత్ చౌదరి, రాజమాత కృష్ణ పటేల్, సంజయ్ చౌహాన్, స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్ వాదీ పార్టీలో చేరారని ఐపీ సింగ్ ఓ ట్వీట్లో చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఓ తాళం కప్పను పంపించానని తెలిపారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడే మార్చి 10న కార్యాలయానికి తాళం వేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలని బీజేపీ నేత స్వతంత్ర దేవ్ సింగ్కు చెప్పారు. ఇది కేవలం ప్రభంజనం కాదని, ఎస్పీ తుపాను అని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి, బీజేపీకి రాజీనామా చేసి మంగళవారం సమాజ్వాదీ పార్టీలో చేరారు. అదేవిధంగా మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సమాజ్వాదీ పార్టీలో చేరారు.