Uttar Pradesh : యోగి ప్రభుత్వంపై దావా వేస్తా : ఆజం ఖాన్
ABN , First Publish Date - 2022-07-14T20:01:33+05:30 IST
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో దావా వేస్తానని
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో దావా వేస్తానని సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) నేత ఆజం ఖాన్ చెప్పారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా జౌహర్ (Jauhar) విశ్వవిద్యాలయం కార్యకలాపాలను అడ్డుకున్నందుకు కోర్టు ధిక్కార (contempt of court) చర్యలు చేపట్టాలని కోరుతానని తెలిపారు.
రామ్పూర్లోని జౌహర్ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముళ్ళ కంచెను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తొలగించలేదని, అందువల్ల ఈ విశ్వవిద్యాలయం కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి వీలుకావడం లేదని చెప్పారు. కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
అలహాబాద్ హైకోర్టు ఓ కేసులో ఆజం ఖాన్కు మే 10న తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. జౌహర్ విశ్వవిద్యాలయానికి ఆనుకుని ఉన్న శత్రు ఆస్తి (భూమి)ని కొలిచి, జూన్ 30నాటికి స్వాధీనం చేసుకోవాలని రామ్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ను ఆదేశించింది. ఆ భూమి చుట్టూ కంచెను నిర్మించాలని ఆదేశించింది.
హైకోర్టు విధించిన ఈ బెయిలు షరతులను మే 27న సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిలిపేసింది. ఆజం ఖాన్ బెయిలు షరతులు ఓ సివిల్ కోర్టు డిక్రీ మాదిరిగా ఉన్నట్లు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ జేబీ పర్దీవాలా సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల్లో జూలై 19నాటికి సమాధానాన్ని దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ జూలై 22న జరుగుతుందని తెలిపింది.