వరల్డ్ చాంపియన్..అలా వేటు తప్పించుకుంది!
ABN , First Publish Date - 2020-10-23T09:47:16+05:30 IST
ప్రపంచ 400 మీ. చాంపియన్ సల్వా ఈద్ నాసర్ డోపింగ్ నిషేధం నుంచి సాంకేతిక నిబంధనతో తప్పించుకుంది
బహ్రెయిన్: ప్రపంచ 400 మీ. చాంపియన్ సల్వా ఈద్ నాసర్ డోపింగ్ నిషేధం నుంచి సాంకేతిక నిబంధనతో తప్పించుకుంది. ఫలితంగా ఆమె వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్లో తలపడనుంది. గత అక్టోబరులో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్షి్ప్సలో 400 మీ. రేస్ను 48.14 సెకన్లలో పూర్తి చేసిన నాసర్ విజేతగా నిలిచింది. అయితే ఏడాది కాలవ్యవధిలో వరుసగా మూడుసార్లు డోప్ పరీక్షకు రావాల్సివుండగా, ఆమె ఒక్కసారి కూడా అందుబాటులో లేక లేకపోవడంతో సల్వాపై గత జూన్లో తాత్కాలిక నిషేధం విధించారు. 2019 ఏప్రిల్లో నమూనాలను సేకరించేందుకు వచ్చిన అధికారి అపార్ట్మెంట్లోని ఆమె ఫ్లాట్కు కాకుండా పొరపాటున వేరే తలుపుతట్టి, నాసర్ లేదని నిర్ధారించుకుని తిరిగివెళ్లారని అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ విచారణ కమిటీ తాజాగా తేల్చింది. ఆమె ఇంటికి కాకుండా వేరే చిరునామాకు వెళ్లినందున...తప్పు నమూనా సేకరణ అధికారిదేనని నిర్ధారించింది. ఇక మార్చి 12, 2019, జనవరి 24, 2020న రెండుసార్లు నాసిర్ డోప్ టెస్ట్లను మిస్సయింది. అయితే జనవరి 1, 2019న ఆమె మిస్సయిన తొలి డోప్ పరీక్షకు చివరి టెస్ట్కు మధ్య ఏడాది కంటే ఎక్కువ సమయం ఉండడంతో నిషేధం నుంచి నాసిర్ బయటపడింది.