సాలూరు టు గోదావరి
ABN , First Publish Date - 2022-08-01T05:57:25+05:30 IST
అరటాకుల ఎగుమతి కేంద్రంగా పేరొందిన సాలూరు నుంచి ఆర్టీసీ బస్సులో రోజూ విశాఖ, విజయనగరం, రావులపాలెం, కాకినాడ తదితర ప్రాంతాలకు అరటాకులు రవాణా అవుతున్నాయి.
విశాఖ, గోదావరి జిల్లాలకు అరటాకులు ఎగుమతి
ఉపాధి పొందుతున్న కార్మికులు
సాలూరు రూరల్, జూలై 31: అరటాకుల ఎగుమతి కేంద్రంగా పేరొందిన సాలూరు నుంచి ఆర్టీసీ బస్సులో రోజూ విశాఖ, విజయనగరం, రావులపాలెం, కాకినాడ తదితర ప్రాంతాలకు అరటాకులు రవాణా అవుతున్నాయి. అక్కడ వాటి వినియోగం ఎక్కువగా ఉండడంతో స్థానికంగా డిమాండ్ కూడా అధికంగానే ఉంది. వాస్తవంగా సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో సుమారు 22 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగు చేస్తున్నారు. ఈ తోటల నుంచి అరటాకులను సేకరించి హోటళ్లకు వేసే కార్మికులున్నారు. సాలూరులో అరటాకులు సేకరించే కార్మికులు 25 మంది వరకూ ఉన్నారు. వారంతా రోజూ వేకువజామునే తోటలకెళ్లి ఆకులను సేకరిస్తారు. 80 ఆకులను కట్టగా కడతారు. 20 కట్టలను మళ్లీ పెద్దకట్టగా కడతారు. వాటిని స్థానిక హోటళ్లతో పాటు విశాఖ, విజయనగరం, రావులపాలెం, కాకినాడ తదితర ప్రాంతాలకు ఆర్టీసీలో రవాణా చేసి మార్కెట్ చేస్తారు. పెద్దకట్ట రూ. 500కు విక్రయిస్తామని కార్మికులు బాబ్జీ, రామకృష్ణ, చుక్క లక్ష్మణ చెప్పారు. ఇదే తమ జీవనాధారమని ఉద్వేగంగా చెప్పారు.