ఉప్పు తగ్గిస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది
ABN , First Publish Date - 2020-03-28T05:54:19+05:30 IST
ఉప్పును అధికంగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదముంటుందని మాత్రమే మనకు తెలుసు. కానీ, ఇటీవల జరిగిన పరిశోధనల్లో మోతాదు మించిన ఉప్పుతో మానవ శరీరంలో రోగ...
ఉప్పును అధికంగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదముంటుందని మాత్రమే మనకు తెలుసు. కానీ, ఇటీవల జరిగిన పరిశోధనల్లో మోతాదు మించిన ఉప్పుతో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా సన్నగిలుతుందని వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ విషయం కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములకు మించకుండా ఉప్పును వాడాలని సూచిస్తోంది. అయితే రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు మాత్రం రోజుకు సగటున పురుషులు పది, మహిళలు ఎనిమిది గ్రాముల వరకు వాడవచ్చని తెలియజేస్తున్నారు. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా, గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మూత్ర పిండాల్లో ఉండే సోడియం క్లోరైడ్ సెన్సర్ ఉప్పు విసర్జన క్రియను సక్రియం (యాక్టివేట్) చేస్తుంది. కానీ, ఇదే సెన్సర్ శరీరంలో గ్లూకోకార్టికాయిడ్లు పేరుకుపోవడానికి కూడా కారణం అవుతుంది. ఇది రక్తంలో రోగనిరోధక కణానికి చెందిన అత్యంత సాధారణ రకం గ్రాన్యులోసైట్స్ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఉప్పును జాగ్రత్త వాడటం ఆరోగ్యకరం.