Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి..!

ABN , First Publish Date - 2022-08-13T03:12:00+05:30 IST

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై తాజాగా దాడి జరిగింది.

Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి..!

న్యూయార్క్: భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై(Salman Rushdie) దాడి(Attack) జరిగింది. న్యూయార్క్(Newyork) నగరంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రష్దీ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓ వ్యక్తి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. తన రచనలతో దైవదూషణకు పాల్పడ్డ రష్దీని మట్టుబెడతామంటూ గతంలో కొందరు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఘటనను ఓ వార్తా సంస్థ రిపోర్టర్ చూశారు. సభకు రష్దీని పరిచయం చేసే క్రమంలోనే దాడి జరిగిందన్నారు. నిందితుడిని వెంటనే అక్కడున్న వారు అదుపు చేశారని తెలిపారు. రష్దీపై నిందితుడు కత్తితో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


1980వ దశకం చివర్లో ‘ది సెటానిక్ వర్సెస్’ అనే నవల కారణంగా రష్దీపై  విమర్శలు వెల్లువెత్తాయి. రష్దీ రచించిన ఆ నవలను ఇరాన్ ప్రభుత్వం 1988లో నిషేధించింది. దీన్ని దైవదూషణ పూరిత రచనగా అభివర్ణించింది. గత 20 ఏళ్లుగా రష్దీ అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. 1975లో ఆయన తొలి నవల వచ్చింది. అయితే.. 1981 నాటి ‘మిడ్‌నైట్ చిల్డ్రన్’ రష్దీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇక రష్దీ నాలుగో రచన ‘సెటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైన తరువాత ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే.. ఎన్ని హెచ్చరికలు ఎదురైనా లెక్కచేయకుండా రష్దీ తన రచనలు కొనసాగిస్తున్నారు. సాహిత్య రంగానికి రష్దీ చేసిన సేవకు గాను బ్రిటన్ రాణి 2007లో ఆయనను ‘నైట్‌హుడ్‌’తో సత్కరించారు. 



Updated Date - 2022-08-13T03:12:00+05:30 IST