50 లక్షల టన్నుల విక్రయ లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-18T07:01:41+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 50 లక్షల టన్నుల సిమెంట్ను విక్రయించాలని సాగర్ సిమెంట్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
సాగర్ సిమెంట్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 50 లక్షల టన్నుల సిమెంట్ను విక్రయించాలని సాగర్ సిమెంట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. కీలక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో సాగర్ సిమెంట్స్ డిమాండ్ 5 శాతం పెరిగే అవకాశం ఉందని కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల్లో గిరాకీ 7 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే బస్తాకు ఉత్పత్తి వ్యయం రూ.40-50 పెరిగినట్లు వివరించారు. గత డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో హైదరాబాద్లో సిమెంట్ బస్తా ధర రూ.15 పెంచినట్లు శ్రీకాంత్ తెలిపారు. 2022-23 ఏడాదికి దాదాపు రూ.30 కోట్ల నిర్వహణ పెట్టుబడులు కంపెనీ పెట్టనుంది. మధ్యప్రదేశ్, ఒడిస్సా ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో సాగర్ సిమెంట్స్ ఉత్పత్తి సామర్థ్యం 82.5 లక్షల టన్నులకు చేరింది. సామర్థ్య వినియోగం 62 శాతం ఉంది.