కేజీహెచ్ నర్సింగ్ సిబ్బందికి జీతాలు పెండింగ్
ABN , First Publish Date - 2022-05-17T06:50:35+05:30 IST
కేజీహెచ్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు.
కాంట్రాక్టుపై పనిచేస్తున్న 268 మందికి మూడు నెలలుగా నిల్
మరో 126 మందికి రెండు నెలలు బకాయి..
ఇబ్బంది పడుతున్నామంటున్న సిబ్బంది
విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): కేజీహెచ్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. కొత్తగా కాంట్రాక్టు బేసిస్లో చేరిన స్టాఫ్ నర్సులు 268 మంది పీఆర్సీ అమలులోకి వచ్చిన తరవాత జనవరి నెల వేతనాలను మాత్రమే తీసుకున్నారు. పాత కాంట్రాక్ట్ బేసిస్లో చేరిన సిబ్బందికి జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన జీతాలు చెల్లించగా, మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు. నెలల తరబడి జీతాలను చెల్లించకపోవడం పట్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారులు దృష్టిసారించి సమస్యను పరిష్కరించాలని స్టాఫ్ నర్సులు కోరుతున్నారు.
బాండ్లు ఇవ్వకపోవం వల్లే..
సిబ్బంది బాండ్లు ఇవ్వకపోవడమే జీతాలు చెల్లించకపోవడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బందికి ఏటా పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం ఇస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ నెలలో పొడిగింపునకు సంబంధించిన జీవో నంబర్ 94ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం స్టాఫ్ నర్సులు నుంచి అధికారులు కాంట్రాక్టుకు సంబంధించిన బాండ్లను స్వీకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాండ్లు స్వీకరిస్తున్న అధికారులు ఫిబ్రవరి నుంచి జీతాలు ఎందుకు చెల్లించలేదో తెలియడం లేదు. అలాగే, పాత కాంట్రాక్ట్ సిబ్బందికి మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన జీతాలను చెల్లించలేదు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన జీతాలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపించామని, ఒకటి, రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.