జీతం మూరెడు.. సేవలు బారెడు

ABN , First Publish Date - 2022-08-20T07:02:49+05:30 IST

జీతం మూరెడు.. సేవలు బారెడు

జీతం మూరెడు.. సేవలు బారెడు

కష్టాల కడలిలో సొసైటీల సీఈవోలు, సిబ్బంది

పే రివిజన అమలు కోసం ఎదురుచూపు

బోనకల్‌, ఆగస్టు 19: గ్రామాల్లో అందుబాటులో ఉంటూ రైతులకు నిత్యం సేవలందిస్తున్న ప్రాథమిక సహకార పరపతి సంఘాల సీఈవోలు, సిబ్బంది కష్టాల కడలిని ఈదుతున్నారు. ఏళ్లతరబడిగా వారు అందిస్తున్న సేవలు ఎన్నో ఉంటున్నా..అందుకు తగిన జీతంమాత్రం అందకపోతుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 73సొసైటీలు ఉండగా అందులో సభ్యుల సంఖ్య మేరకు ఒక సీఈవో, ఇద్దరు స్టాఫ్‌ అసిస్టెంట్లు, ఒక అంటెడరు విధులు నిర్వర్తిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2009లో ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగులకు 151జీవో ద్వారా ఒక పే స్కేలు స్ట్రక్చర్‌ను ఇచ్చారు. నాటినుంచి నేటి వరకు అదే స్కేళ్లు అమలవుతున్నాయి. మారిన జీవన ప్రమాణాల మేరకు కొత్త పే స్కేళ్లు ఇవ్వకపోవడంతో వారంతా కష్టాలను ఎదుర్కొంటున్నారు. కొత్తగా నియమితులైన సీఈవోకు మూలవేతనం రూ.1640, కరవుభత్యం 9107, ఇంటి అద్దె భత్యం 300 మొత్తం కలిపి రూ.11047 జీతం వస్తుంది. స్టాఫ్‌ అసిస్టెంట్లకు కూడా ఇంచుమించు ఇదేపద్ధతిలో జీతాలు వస్తున్నాయి. సీనియార్టీని బట్టి రూ.75 నుంచి రూ.180 వరకు ఏడాదికి వేతనాన్ని పెంచుతున్నారు. ఇక 25ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగికి కూడా రూ.30వేల లోపు వేతనం మాత్రమే అందుతోంది. వీరికి సొసైటీల ద్వారానే జీతాలు ఇస్తుండటంతో సంఘాలు నష్టంలో ఉంటే సిబ్బందిని వేరే చోటకు పంపిస్తారు. ఉన్న ఉద్యోగం వదులుకోలేక, వేరేపని చేయలేక ఇబ్బందులతోనే నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ భద్రత, పే రివిజన అమలు, హెచఆర్‌ పాలసీలను అమలు చేసి రైతుమిత్రులుగా ఉండే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


రైతుల కోసం నిర్విరామంగా సేవలు

సొసైటీల సీఈవోలు, సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూ సెలవులు లేకుండా రైతులకు సేవలందిస్తున్నారు. రైతులకు రుణాల పంపిణీతోపాటు వసూళ్లు, రికార్డుల నిర్వహణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తుంటారు. సొసైటీల ద్వారా డిపాజిట్ల సేకరణ, పొదుపులు, ధాన్యం కొనుగోలు చేయడం, వాటికి సంబంధించిన డబ్బులను రైతులకు అందజేయడం చేస్తున్నారు. సొసైటీల బలోపేతానికి కొన్ని సం ఘాల్లో సూపర్‌ మార్కెట్ల నిర్వహణ, నిత్యవసరాల పంపిణీ, పెట్రోల్‌ బంకు ల ఏర్పాటు లాంటి వ్యాపారాలను కొనసాగించి వాటిని లాభాలభాటలో నడిపేందుకు కృషిచేస్తున్నారు. పనితగిన వేతనాలను ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఉద్యోగ భద్రత కల్పించాలి

మల్లికార్జున, సీఈవో కలకోట

సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తున్నాం. రైతులకు నిత్యం అందుబాటులో ఉండే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పే రివిజన అమలు చేయాలి. చాలీచాలని జీతాలతో అష్టకష్టాలు పడుతున్నాం. 


 రైతుల కోసం కష్టపడి పని చేస్తున్నాం

మండేపుడి వెంకటేశ్వరావు, సీఈవో, బోనకల్‌

రైతుల కోసం నిత్యం కష్టపడి పని చేస్తున్నాం. రెండు దశాబ్దాలుగా సహకార రంగంలో సీఈవోగా సేవలందిస్తున్నా. నాకు సమాన సర్వీసుతో పని చేసే వేరే శాఖల ఉద్యోగులకు జీతం రూ.80వేల వరకు అందుతోంది. ఇంక్రిమెంట్లు, బేసిక్‌ తక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం. 


వేతనాలు పెంచేలా పే రివిజన్‌ అమలుచేయాలి

ఉమామహేశ్వరరావు, సీఈవో, ముష్టికుంట్ల

సొసైటీల సీఈవోలు, సిబ్బందికి వేతనాలు పెంచేలా ప్రభుత్వం పే రివిజన అమలు చేయాలి. తక్కువ వేతనాలతో పని చేయడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సంఘాలు, రైతుల కోసం అంకితభావంతో పని చేస్తున్నాం. అందుకు తగినట్టుగా తమ సేవలను పరిగణనలోకి తీసుకోవాలి.

Updated Date - 2022-08-20T07:02:49+05:30 IST