‘ఆత్మ’ల వేతన వెతలు

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

రైతులకు ఎప్పుటికప్పుడు నూతన పద్ధతుల్లో పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ వారికి వెన్నంటిగా నిలిచే అగ్రికల్చర్‌ టెక్నికల్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ(ఆత్మ) అధికారులకు జీతాలు రావడం లేదు.

‘ఆత్మ’ల వేతన వెతలు
బెజ్జంకిలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఆత్మ అధికారులు(ఫైల్‌)

 10 నెలలుగా జీతాలు లేక విలవిల


బెజ్జంకి, మే 16 : రైతులకు ఎప్పుటికప్పుడు నూతన పద్ధతుల్లో పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ వారికి వెన్నంటిగా నిలిచే అగ్రికల్చర్‌ టెక్నికల్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ(ఆత్మ) అధికారులకు జీతాలు రావడం లేదు. 10 నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. రైతులకు వివిధ పంటలపై శిక్షణ ఇచ్చే అధికారులకు జీతాలు, సదరు విభాగానికి నిధులు లేకపోవడంతో రైతులకు సరైన సేవలు అందడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది ఆత్మ అధికారులుండగా సిద్దిపేట జిల్లాలో 15 మంది, హుస్నాబాద్‌ డివిజన్‌లో ముగ్గురు పనిచేస్తున్నారు. జీతాలు లేకుండా పనిచేస్తున్నప్పటికి ప్రభుత్వం తమసేవలను గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రైతులకు అండగా ఆత్మ అధికారులు


రైతులకు పంటల సాగు, నూతన దిగుబడి, ఆధునిక వంగడాల విధానాలపై అవగాహన కల్పించడంలో ఆత్మ అధికారులు కీలకపాత్ర పోషిస్తుంటారు. పంటల నూతన సాగు విధానాలపై ఎప్పటికప్పుడు రైతులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఏఈవోల విధులు కూడా నిర్వహిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పంటల నమోదు పక్రియలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆత్మ సిబ్బంది వారికి జీతాలు రావడం లేదని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు కాలయాపన చేస్తూ వీరిని విస్మరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఆత్మ ఆధికారులకు నిధులను కేటాయించాలి. 


 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST