శాకంబరి సంబరం

ABN , First Publish Date - 2021-07-24T06:51:19+05:30 IST

ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

శాకంబరి సంబరం

తరలి వచ్చిన భక్తజనం

విజయవాడ, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో క్యూలైన్లు రద్దీగానే కనిపించాయి. భక్తులు కొవిడ్‌ నిబంధనలను పాటించేలా ఆలయ సిబ్బంది, పోలీసులు శ్రద్ధ తీసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా రైతులు, దాతలు ఇచ్చిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారి మూలవిరాట్టును, మహామండపం ఆరో అంతస్థులో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తిని, ప్రధాన ఆలయాన్ని, ఆలయ పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. పలువురు భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు దంపతులు, రాష్ట్ర సమాచార కమిషనర్‌ శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.ఫార్థసారథి దంపతులు, పలువురు రాజకీయ నాయకులు, అధికార, అనధికార ప్రముఖులు శాకంబరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి అమ్మవారికి సారె సమర్పించారు.  

Updated Date - 2021-07-24T06:51:19+05:30 IST