దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌..తనకేం తెలియదన్న సజ్జనార్‌..!

ABN , First Publish Date - 2021-10-13T09:13:49+05:30 IST

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తనకు తెలియదని అప్పటి సైబరాబాద్‌ సీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌..తనకేం తెలియదన్న సజ్జనార్‌..!

పోలీసు కస్టడీ, సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ గురించి చెప్పలేదు.. ఉదయమే నలుగురు మరణించినట్లు తెలిసింది

 డయల్‌-100, షీటీమ్స్‌పై అవగాహన కల్పించేందుకే ప్రెస్‌మీట్‌

 కమిషన్‌ ముందు సజ్జనార్‌ వాంగ్మూలం

 దిశ కమిషన్‌ ఆగ్రహం


హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తనకు తెలియదని అప్పటి సైబరాబాద్‌ సీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. నిందితులను సీన్‌-రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసు అధికారులెవరూ తనకు చెప్పలేదని స్పష్టం చేశారు. 2019 డిసెంబరు 6 ఉదయం 6.15 గంటలకు ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్లు శంషాబాద్‌ డీసీపీ తనకు సమాచారం ఇచ్చారన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో రెండోరోజు(మంగళవారం) దిశ కమిషన్‌కు సజ్జనార్‌ వాంగ్మూలం ఇచ్చారు. రెండో రోజు దాదాపు నాలుగున్నర గంటల పాటు 120 ప్రశ్నలను సజ్జనార్‌పై విచారణ కమిషన్‌ సంధించింది. పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అడిగిన ప్రశ్నకే పరిమితమై నేరుగా సమాధానం చెప్పాలని విచారణ కమిషన్‌ స్పష్టం చేసింది. దిశ ఘటన తర్వాత ప్రజల్లో భయం నెలకొందని, డయల్‌-100, షీటీమ్స్‌పై అవగాహన కల్పించేందుకే 2019 నవంబరు 29న ప్రెస్‌మీట్‌ నిర్వహించానని సజ్జనార్‌ చెప్పడం గమనార్హం.


అవగాహన కోసమైతే.. ఆ ప్రెస్‌మీట్‌లో ఏ1 నిందితుడి వాంగ్మూలాన్ని ఎందుకు వెల్లడించారని ప్రశ్నించింది. కోర్టు పరిధిలోని అంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు చెప్పారని నిలదీసింది. శంషాబాద్‌ డీసీపీ ఇచ్చిన సమాచారం మేరకు వెల్లడించానని సజ్జనార్‌ సమాధానం ఇవ్వడంతో.. ‘‘మీరు స్వతంత్రంగా ఆలోచించరా? మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? అన్ని ప్రశ్నలకు శంషాబాద్‌ డీసీపీ అని సమాధానం చెబుతున్నారు? ఇంతకు మీరేం చేస్తారు?’’ అని కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబరాబాద్‌కు తాను శాంతిభద్రతల పర్యవేక్షణ ఇన్‌చార్జ్‌ అని, క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే సమాచారం మేరకు వ్యవహరిస్తారని చెప్పారు. ‘‘మీ కమిషనరేట్‌ పరిధిలో ఏం జరిగినా మీకు బాధ్యత ఉంటుంది కదా?’’ అని ప్రశ్నించగా.. ఆ వాదనతో తాను ఏకీభవించబోనన్నారు. దిశ అదృశ్య ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం జరిగింది వాస్తవమేనా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. అవునని సమాధానమిచ్చారు. నిందితులను గెస్ట్‌హౌ్‌సలో ఉంచేందుకు తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. ఫైరింగ్‌లో స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌(ఎ్‌సవోటీ)కి చెందిన ఎస్సైలు లాల్‌ మదార్‌, రవి, హెడ్‌కానిస్టేబుల్‌ సిరాజుద్దీన్‌ పాల్గొన్నారని తెలిపారు.


ప్రెస్‌మీట్‌ నాలుగు భాషల్లోనా!?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ స్థలంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతదేహాల పంచనామా పూర్తికాకుండానే ప్రెస్‌మీట్‌ పెట్టడమేంటని ప్రశ్నించింది. నాలుగు భాషల్లో సజ్జనార్‌ మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. సంఘటన స్థలంలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటుకు కుర్చీలు, టేబుళ్లు ఎవరు సమకూర్చారని సజ్జనార్‌ను అడిగింది. ఈ ప్రశ్నలకు తనకు తెలుగు సరిగా రాదని, 20 ఏళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్నా.. ఇక్కడ ఎక్కువ మంది హిందీ మాట్లా డుతారని చెప్పారు. ‘‘ఐపీఎస్‌ అధికారిగా తెలుగు భాష పరీక్ష రాయలేదా?’’ అని ప్రశ్నించగా.. 2000లోనే తెలుగు పరీక్ష పాసయ్యానని సజ్జనార్‌ చెప్పారు. తాను తెలుగు బాగా రాయగలనని, అంత వేగంగా మాట్లాడలేనని చె ప్పారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు అంటూ పత్రికల్లో వచ్చిన కథ నాలపై ప్రశ్నించగా.. ఆ పదానికి అర్థం తెలియదని, తాను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు కాదని పేర్కొన్నారు.


అది స్ట్రీట్‌ క్రైమ్‌ కాదుగా..!

దిశ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, ఆ కేసును సజ్జనార్‌ తాను పర్యవేక్షించలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందని కమిషన్‌ వ్యాఖ్యానించింది. అది స్ట్రీట్‌ క్రైమ్‌ కాదని స్పష్టం చేసింది. కీలక కేసులో బాధ్యాతాయుతంగా వ్యవహరించాల్సిన సీపీ.. తనకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. వేరే విషయాలతో తాను బిజీగా ఉన్నానని, అందుకే కేసు దర్యాప్తును పర్యవేక్షించలేదని ఆయన సమాధానమిచ్చారు. బీఎ్‌సఎన్‌ఎల్‌, జియో, వొడాఫోన్‌ నోడల్‌ ఆఫీసర్ల వాంగ్మూలాలను కూడా కమిషన్‌ నమోదు చేసింది. దసరా నేపథ్యంలో మూడు రోజుల పాటు విచారణను వాయిదా వేసింది. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని మరోసారి విచారణకు పిలిపించాలని కమిషన్‌ నిర్ణయించింది.

Updated Date - 2021-10-13T09:13:49+05:30 IST