పోలీస్ వ్యవస్థ అంటేనే అసహ్యం వేస్తోంది : సాయితేజ తండ్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-10T16:28:55+05:30 IST

తాను సైతం ఆర్మీలోకి వెళ్లి దేశానికి సేవ చేయాలనుకున్నానని.. అది కుదరలేదని.. ఇప్పుడు తన ఇద్దరు కుమారుల ద్వారా అది కుదిరిందని ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ తండ్రి మోహన్ వ్యాఖ్యానించారు.

పోలీస్ వ్యవస్థ అంటేనే అసహ్యం వేస్తోంది : సాయితేజ తండ్రి సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు : తాను సైతం ఆర్మీలోకి వెళ్లి దేశానికి సేవ చేయాలనుకున్నానని.. అది కుదరలేదని.. ఇప్పుడు తన ఇద్దరు కుమారుల ద్వారా అది కుదిరిందని ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ తండ్రి మోహన్ వ్యాఖ్యానించారు. నేడు ఆయన ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థ అంటేనే అసహ్యం వేస్తోందని.. వారు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని మోహన్ పేర్కొన్నారు. తన రెండేళ్ల మనవరాలు తీవ్ర అనారోగ్యం బారిన పడితే బైక్‌పై తీసుకెళ్తుండగా పోలీసులు తనను మధ్యలో ఆపి అన్ని పత్రాలు ఉన్నా కూడా ఇబ్బందులకు గురిచేశారన్నారు. తన కుమారులిద్దరూ ఆర్మీలో పని చేస్తున్నారని చెప్పినా వినకుండా పైన్ వేసి నానా రకాల ఇబ్బందులకు గురి చేశారన్నారు.


అలాంటి పోలీసు వ్యవస్థ ఈరోజు తన కొడుకు అంత్యక్రియల కోసం ఇక్కడకు వచ్చి హంగామా చేయడం చూస్తుంటే బాధేస్తోందని మోహన్ పేర్కొన్నారు. మా పెద్దబ్బాయి సాయి తేజ ఉన్నత స్థాయి అధికారి వద్ద విధులు నిర్వర్తిస్తూ దేశం కోసం ప్రాణాలు కోల్పోవడం గర్వం గానే ఉన్నా, కొడుకును కోల్పోయిన బాధను తట్టుకోలేక పోతున్నానన్నారు. దేశం కోసం పని చేస్తున్న ఆర్మీ పిల్లల కుటుంబాలకు ఇదేనా పోలీసులిచ్చే గౌరవం అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం తల్లిదండ్రులు, పిల్లల వద్ద ఆర్మీ వైద్య బృందం రక్త నమూనాలు సేకరించినట్టు మెహన్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-10T16:28:55+05:30 IST