సాయితేజ్ యాక్సిడెంట్ ఎఫెక్ట్: లక్ష ఫైన్

ABN , First Publish Date - 2021-09-13T21:25:13+05:30 IST

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి వంతెనకు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

సాయితేజ్ యాక్సిడెంట్ ఎఫెక్ట్: లక్ష ఫైన్

హైదరాబాద్: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి వంతెనకు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి కిందపడ్డారు. హెల్మెట్ ధరించడంతో సాయితేజ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


ప్రమాదానికి కారణాలు

సాయితేజ్ బాధ్యత గల పౌరుడిగా హెల్మెట్ ధరించి, తక్కువ స్పీడ్‌తోనే వెళ్తున్నారని ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు చెబుతున్నారు. రోడ్డుపై మట్టి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రంగా ఉంచాల్సిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి కారణమైన జీహెచ్ఎంసీపై కూడా కేసు పెట్టాలని కొందరు సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు.


సినీ నటుడికి ప్రమాదంతో మేల్కొన్న జీహెచ్ఎంసీ

రోడ్డుపై మట్టి వల్ల సినీ నటుడు ప్రమాదం బారిన పడడంతో జీహెచ్ఎంసీ మేల్కొంది. ప్రత్యేక చర్యలు చేపడుతూ రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను  రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణ పనుల వల్ల మట్టి, ఇసుక రోడ్లపై పడుతుండడంతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు సత్వర చర్యలు తీసుకున్నారు.



Updated Date - 2021-09-13T21:25:13+05:30 IST