థామస్ కప్లో ఆడలేను
ABN , First Publish Date - 2020-09-10T08:54:01+05:30 IST
బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్ థామస్ ఉబెర్కప్ నుంచి వైదొలిగాడు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్ థామస్ ఉబెర్కప్ నుంచి వైదొలిగాడు. ఇదే టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో పీవీ సింధు తొలుత తప్పుకోగా, ఆ తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య విజ్ఞప్తితో ఆమె తిరిగి భారత బృందంలో చేరిన విషయం తెలిసిందే.
సింధు చేరికతో జోష్ వచ్చిందని ఆనందపడుతున్న తరుణంలో టోర్నీ నుంచి ప్రణీత్ తప్పుకుంటున్నాడన్న వార్త బ్యాడ్మింటన్ అభిమానులను నిరాశపరిచింది. ప్రణీత్ తప్పుకోవడంతో భారత పురుషుల బృందాన్ని కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. అతడితో పాటు కశ్యప్, లక్ష్యసేన్, శుభాంకర్ డే జట్టులో ఆడనున్నారు. ‘లాక్డౌన్తో ఐదునెలలు కోర్టుకు దూరంగా ఉండడంతో ఫిట్నెస్ దెబ్బతింది. ఈనెల 6 నుంచి సాధన ప్రారంభించా కానీ, పూర్తిగా గాడిలో పడలేదు. వచ్చే జనవరిలో ఒలింపిక్స్ అర్హత పోటీలు ఉండడంతో సంపూర్ణ ఫిట్నెస్ సంతరించుకున్నాకే టోర్నీల బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నా’ అని ప్రణీత్ తెలిపాడు.