సాయిదత్త పీఠంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2020-06-23T02:11:07+05:30 IST

న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దత్త

సాయిదత్త పీఠంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఎడిసన్: న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దత్త పీఠంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్వయంగా పీడియాట్రీషియన్, సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్ అయిన డా.విజయ నిమ్మ పాల్గొన్నారు. ఎస్.డి.పి సూర్య యోగ పేరుతో డా. విజయ గత 5 సంవత్సరాలుగా ఎంతో అభిరుచితో అనేక మందికి నిత్యం యోగా నేర్పిస్తూ తనవంతుగా కమ్యూనిటీ సేవ చేస్తున్నారు. ఎస్.డి.పి గురుకులంలో చిన్న పిల్లలకు కూడా యోగా  నేర్పిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ముమ్మరంగా ఉన్న నేపథ్యంలో యోగా ఆవశ్యకతను అందరికి తెలియజేసి రోగనిరోధక శక్తి పెంపొదించుకోవటానికి అవసరమైన ఆసనాలపై అవగాహన పెంపొందిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ తరగతులను ఉచితంగా నిర్వహిస్తూ, అందరూ యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. అదే తనకు ఇచ్చే గురుదక్షిణ అని బాబా పై తనకున్న భక్తిని, గౌరవాన్ని డా.విజయ చాటుకున్నారు. 


భారతీయ యోగా యావత్ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే మంత్రంలా మారిందని సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి అన్నారు. ప్రపంచానికి యోగాను అందించిన భారతదేశంలో పుట్టినందుకు నిజంగా ఎంతో గర్వపడాలని అన్నారు. అలానే భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాను విస్మరించకూడదని.. యోగా ద్వారా శారీరక, మానసిక బలం పెరుగుతుందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పుడు యోగా  ప్రధానమైన అస్త్రమని.. యోగా గొప్పతనం ఇప్పుడు యావత్ ప్రపంచం గుర్తిస్తోందన్నారు. యోగా మనుషుల్లో రోగ నిరోధకశక్తిని పెంచుతుందన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుని ఆలయంలో కొంతమందితో యోగాసనాలు వేయించి, ఆన్ లైన్‌లో ద్వారా మిగతా వారికి కూడా ఆసనాల విశిష్టత గురించి వివరించారు.

Updated Date - 2020-06-23T02:11:07+05:30 IST