నేటి యువత తెలుగు భాష ఉన్నతికి కృషి చేయాలి:జూలూరు గౌరీశంకర్
ABN , First Publish Date - 2022-06-30T00:50:01+05:30 IST
నేటియువత ఆంగ్లమాధ్యమంలోనే చదువుతూ తెలుగు భాషకు దూరం అవుతున్న ఈ సందర్భంలో ఒక విదేశీయురాలు తెలుగు భాష మీద ఇష్టంతో సొంతంగా తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవడం గొప్ప విషయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: నేటియువత ఆంగ్లమాధ్యమంలోనే చదువుతూ తెలుగు భాషకు దూరం అవుతున్న ఈ సందర్భంలో ఒక విదేశీయురాలు తెలుగు భాష మీద ఇష్టంతో సొంతంగా తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవడం గొప్ప విషయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు.యుఎస్ కు చెందిన బ్రీ అనే విదేశీయురాలు తెలుగు భాషకు చేస్తున్న కృషిని గుర్తించిన గౌరీశంకర్ ఆమెను రవీంద్రభారతికి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ చక్కని నుడికారాలతో, పలుకులతో తేనే కంటే మధురంగా ఉన్న తెలుగు భాష మనదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో సైతం ఎంతో ప్రాచుర్యం పొందుతోందని అన్నారు.
మన తెలుగు భాషను నేర్చుకోవడానికి ఎంతోమంది విదేశీయులు తహతహలాడుతున్నారన్న దానికి యుఎస్ కు చెందిన బ్రీ అనే అమ్మాయి నిదర్శనమని, తెలుగులో రాయడం, చదవడమేకాకుండా తెలుగు వ్యాకరణం, పద్యాలు అలవోకగా చదివేస్తుందని పేర్కొన్నారు. నేటి యువత బ్రీ ని ఆదర్శంగా తీసుకొని తెలుగు భాష ఉన్నతికి కృషి చేయాలని కోరారు.తెలుగు నేర్చుకోవాలన్న తపనతో హైదరాబాద్కు వచ్చిన అమెరికా అమ్మాయి బ్రీ బుధవారం నాడు సాహిత్య అకాడమి కార్యాలయంకు వచ్చి తెలుగు పద్యాన్ని మంచి ఉచ్చారణతో చదివి వినిపించింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.