ఓబీసీకి చేరిన సాగర్ జలాలు
ABN , First Publish Date - 2021-05-17T07:11:20+05:30 IST
మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు ఆదివారం ఒంగోలు బ్రాంచ్ కాలువ(ఓబీసీ)కు చేరాయి.
దర్శి, మే 16: మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు ఆదివారం ఒంగోలు బ్రాంచ్ కాలువ(ఓబీసీ)కు చేరాయి. జిల్లాలోని మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు మూడు రోజుల క్రితం సాగర్ జలాలు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలుకు(ప్రకాశం బార్డర్) 1793 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అక్కడ నుండి దర్శి బ్రాంచ్ కాలువకు 546 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్ కాలువకు 400 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. సోమవారం ఉదయానికి ఒంగోలు బ్రాంచ్ కాలువకు నీటి పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ఎన్ఎస్పీ అధికారులు ప్రస్తుతం అన్నీ మేజర్లు మూసివేసి రామతీర్ధం జలాశయంకు నీటిని మళ్లించారు. వారం రోజుల పాటు రామతీర్ధం జలాశయంకు నీరు నింపిన తర్వాత మిగిలిన మంచినీటి చెరువులకు నీరు విడుదల చేస్తామని డీఈ అక్బర్బాష తెలిపారు. తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటిని ఎవరూ దుర్వినియోగం చేయవద్దని సూచించారు. ఎక్కడైనా ట్యాంపరింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.