నీటి విడుదలపై.. సందిగ్ధం

ABN , First Publish Date - 2022-07-13T05:22:57+05:30 IST

నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు నీటి విడుదల సందిగ్ధంలో పడింది.

నీటి విడుదలపై.. సందిగ్ధం
సాగర్‌ కుడి కాలువ

ప్రకటనతో సరిపుచ్చిన ప్రభుత్వం

కేఆర్‌ఎంబీతో సంప్రదింపులు చేయని పాలకులు

ప్రతిపాదనల్లోనే కుడి కాలువకు నీటి కేటాయింపులు 

15న నీటి విడుదలకు అనుమతి ఇవ్వని కేఆర్‌ఎంబీ 

 

నరసరావుపేట, జూలై 12: నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు నీటి విడుదల సందిగ్ధంలో పడింది. ఈ నెల 15న నీటి విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తేదీ సమీపిస్తున్నా ఆ ప్రకారం నీటి విడుదల చేసే పరిస్థితులు కానరావడంలేదు. జలాశయం నుంచి నీటి విడుదల చేయాలంటే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) అనుమతి తప్పని సరి. అయితే మంగళవారం సాయంత్రం వరకు కేఆర్‌ఎంబీ నుంచి నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదని జలవనరుల శాఖ ఎస్సీ డీ వరలక్ష్మి తెలిపారు. కుడి కాలువకు 132 టీఎంసీల నీటి కేటాయింపునకు ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి ప్రతిపాదనలు పంపింది. దీనిపై బోర్డు స్పందించలేదు. ఈ విషయంలో ముందు నుంచి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. అయితే అవేవీ చేయకుండా ముందస్తుగా నీటి విడుదల తేదీని ప్రభుత్వం ప్రకటించింది. కుడి కాలువకు నీటి విడుదలకు ముందుగా ప్రకటించిన తేదీని అమలు చేయాలంటే కేఆర్‌ఎంబీతో చర్చలు జరిపి అనుమతులు పొందేందుకు  కృషి చేయాలి. అప్పుడే   ప్రకటించిన తేదీ 15న నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఏ మేరకు కృషి చేస్తుందో చూడాలి. 


జలాశయాల్లోకి వరద ప్రవాహం

కృష్ణా నదీ పరివాహ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మటి, తుంగభద్ర జలాశయాలకు భారీగా వరద నీరు వస్తున్నది. తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు నీటి విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్మట్టిలో కూడా నీటి నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయి. నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తి స్థాయిలోనే ఉన్నాయి. శ్రీశైలం జలాశయం నిండాలంటే ఇంకా 171.99 టీఎంసీల నీరు అవసరం. ఈ జలాశయానికి ఉన్న నీటి నిల్వలతో పాటు ఇంకా 125 టీఎంసీల నీరు వస్తేనే సాగర్‌కు నీటిని విడుదల చేస్తారు. దాదాపు 150 టీఎంసీల నీటి లోటు ఉంది. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుని కేఆర్‌ఎంబీ కుడి కాలువకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటుందని జలవనరులశాఖ నిపుణులు చెబుతున్నారు. 

 

Updated Date - 2022-07-13T05:22:57+05:30 IST