ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సచిన్!
ABN , First Publish Date - 2021-04-09T01:13:39+05:30 IST
కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువారం నాడు డిశ్చార్ అయ్యారు.
ముంబై: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువారం నాడు డిశ్చార్ అయ్యారు. ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స కొనసాగించాలని ఆయనకు వైద్యులు సూచించారు. మార్చి 27న సచిన్ కరోనా బారినపడ్డట్టు వెల్లడైన విషయం తెలిసిందే. ఆ తరువాత.. ఓ మోస్తరు తీవ్రతలో వ్యాధి లక్షణాలు బయటపడటంతో సచిన్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాను డిశ్చార్జ్ అయినట్టు సచిన్ గురువారం నాడు ట్వీట్ చేశారు. తన కోసం ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు, వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
‘ఇప్పుడే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చా. అయితే నేను మరికొంత కాలం పాటు ఐసోలేషన్లో ఉండాలి. నా క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆస్పత్రిలో ఇంతకాలం నన్ను జాగ్రత్తగా చూసుకున్న వైద్య సిబ్బందికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇంతటి కఠిన పరిస్థితుల్లో ఏడాదిగా వారు నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సందర్భంగా సచిన్ మరోసారి బ్యాట్ పట్టి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సచిన్తో పాటు యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, జాంటీ రోడ్స్ వంటి హేమాహేమీలందరూ ఈ టోర్నీలో పాల్గొని క్రికెట్ అభిమానులకు నాటి రోజులను గుర్తుకు తెచ్చారు. అయితే..టోర్నమెంట్ పూర్తైన తరువాత.. సచిన్, సుబ్రమణియమ్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తాము కరోనా బారినపడ్డామని వెల్లడించారు.