రాజస్థాన్ ప్రభుత్వ కూల్చివేత యత్నాలపై సచిన్ పైలట్పై దర్యాప్తు
ABN , First Publish Date - 2020-07-12T20:45:54+05:30 IST
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై
జైపూర్ : రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ యువ నేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ను ప్రశ్నించబోతున్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఏర్పాటైన రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) ఆయనను ప్రశ్నించబోతోంది. ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు సమయం ఇవ్వాలని ఆయనను కోరింది.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించేందుకు సమయం ఇవ్వాలని సచిన్ పైలట్కు ఎస్ఓజీ ఈ నెల 10న నోటీసు ఇచ్చింది. ఇటువంటి లేఖను ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్కు కూడా అదే రోజు పంపించడం గమనార్హం.
స్టేట్మెంట్లను నమోదు చేయడానికి అనువైన సమయాన్ని, తేదీని తెలియజేయాలని ఈ నేతలిద్దరినీ ఎస్ఓజీ కోరింది.
ఇదిలావుండగా, అశోక్ గెహ్లాట్ శనివారం మాట్లాడుతూ, తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఇస్తామని ఆశ చూపుతోందని పేర్కొన్నారు.
అశోక్ గెహ్లాట్ ఆరోపణలను బీజేపీ, దాని మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఖండించాయి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని ఆరోపించాయి. గెహ్లాట్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను నమ్మలేకపోతున్నారని ఎద్దేవా చేశాయి.
రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా మాట్లాడుతూ, అశోక్ గెహ్లాట్ నక్కజిత్తులమారి రాజకీయ నేత అని దుయ్యబట్టారు. పరిపాలనలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని నిందించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.